జట్టులో చోటే లక్ష్యం.. ముందే ధోనీ ప్రాక్టీస్

by Shyam |
జట్టులో చోటే లక్ష్యం.. ముందే ధోనీ ప్రాక్టీస్
X

టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ ముందుగానే ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఐపీఎల్ ఆరంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ధోనీకి చెన్నైలో భారీ సంఖ్యలో అభిమానులున్నారు. వారిని అలరించేందుకు లుంగీలో కూడా సందడి చేస్తుంటాడు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న ధోనీ మార్చి 2న తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు.

చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఐపీఎల్ సీజన్ 13 కోసం ప్రాక్టీస్ ప్రారంభించనున్నాడు. ఇప్పటికే సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ సురేష్‌ రైనా, అంబటి రాయుడులతో పాటు పలువురు ఆటగాళ్లు గత మూడు వారాలుగా ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. మార్చి 2న వారితో కలిసి ప్రాక్టీస్ ప్రారంభించనున్న ధోనీ, రెండు వారాల కఠోర శిక్షణ తరువాత చిన్న విరామం తీసుకోనున్నాడు.

మార్చి 19 నుంచి సీఎస్కే రెగ్యులర్ క్యాంప్‌లో పాల్గొంటాడు. ఈ టోర్నీలో సత్తా చాటడం ద్వారా టీ20 జట్టులో స్థానం సంపాదించడంతో పాటు వచ్చే వరల్డ్ కప్‌లో స్థానం కోసం ధోనీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. అయితే వరల్డ్ కప్‌లో కోహ్లీ కెప్టెన్సీలో ధోనీ ఎలా ఆడుతాడన్న ఆసక్తి అందర్లోనూ ఉంది.

మూడు సార్లు ఐపీఎల్ విజేతగా, ఐదు సార్లు రన్నరప్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి విజేతగా నిలవాలని భావిస్తోంది. గతేడాది రన్నరప్‌తో సరిపెట్టుకున్న సీఎస్కే ఈసారి విజయం సాధించాలన్న లక్ష్యంతో వేలంలో పియూష్ చావ్లా, హాజిల్‌వుడ్, శామ్ కరన్, సాయి కిశోర్‌లను కొనుగోలు చేసింది. వచ్చేనెల 29న ముంబై ఇండియన్స్‌తో సీఎస్కే తలపడనుంది.

Next Story

Most Viewed