సభ్యత్య నమోదుపై అధిష్టానం టార్గెట్ రీచ్ అయ్యేనా..?

by karthikeya |
సభ్యత్య నమోదుపై అధిష్టానం టార్గెట్ రీచ్ అయ్యేనా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ జాతీయ నాయకత్వం సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణలో 50 లక్షల సభ్యత్వాలను టార్గెట్ పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలవడం, దాదాపు 37 లక్షల పైచిలుకు ఓట్లు సాధించడం ఈ టార్గెట్‌కు కారణమైంది. ఆ ఓట్లను చూసి బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణకు భారీ స్థాయిలో టార్గెట్ ఫిక్స్ చేసింది. కానీ పార్లమెంట్ ఎన్నికల అనంతరం పార్టీలో అనుకున్న స్థాయిలో ఎలాంటి యాక్టివిటీ లేకపోవడంతో హైకమాండ్ ఇచ్చిన టార్గెట్‌ను రీచ్ అవ్వడం రాష్ట్ర నాయకత్వానికి సవాలుగా మారింది. తొలుత బీజేపీ రాష్ట్ర నాయకత్వం హుషారుగానే మెంబర్ షిప్ డ్రైవ్ ను ప్రారంభించాలని భావించింది. కానీ అనుకున్న స్థాయిలో మద్దతు లభించకపోవడంతో దాదాపు 20 లక్షల వరకు సభ్యత్వాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

రాష్ట్రంలో సెప్టెంబర్ 8 నుంచి సభ్వత్వ నమోదు ప్రారంభమైంది. వాస్తవానికి ఈ డ్రైవ్ ను సెప్టెంబర్ 2 నుంచే ప్రారంభించాలని పార్టీ భావించినా భారీ వర్షాల నేపథ్యంలో వాయిదా పడింది. అయితే మెంబర్ షిప్ డ్రైవ్ ను తొలుత చేపట్టేందుకు కమలం పార్టీ రాష్ట్ర నాయకత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ప్రభారీలను నియమించింది. అయినా సకాలంలో సగం లక్ష్యాన్ని కూడా రీచ్ అవ్వకపోగా గడువు పొడిగించినా కూడా సగం సభ్యత్వాలు కంప్లీట్ అవ్వకపోవడంపై పార్టీ ఆగ్రహంగా ఉంది. గత నెల తెలంగాణలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.., మెంబర్ షిప్ డ్రైవ్ కంప్లీట్ అవ్వకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. మరో 15 రోజులు డెడ్ లైన్ విధించారు.

ఆపై మరోసారి రివ్యూ నిర్వహిస్తానని, అప్పటి వరకు కంప్లీట్ అవ్వాలని స్పష్టంచేశారు. ఆ డెడ్ లైన్ ముగిసినా దాదాపు 20 లక్షల సభ్యత్వాలే చేయడంపై హైకమాండ్ ఆగ్రహంగా ఉంది. దీంతో ఈ గడువును మరోసారి పొడిగించారు. ఈనెల 24వ తేదీ వరకు కంప్లీట్ చేయాలని ఆదేశించారు. అయితే మరో 8 రోజులే మిగిలుండగా ఇంత తక్కువ సమయంలో 30 లక్షల సభ్యత్వాలు చేయడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. అందుకే ప్రభారీలకు అదనంగా తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పార్టీలో కీలక నేతలకు బాధ్యతలు అప్పగించింది.

సభ్యత్వ నమోదుకు అన్ని జిల్లాలకు ప్రభారీలను పార్టీ నియమించగా, అందులో కొందరు పట్టించుకోకపోవడం, పట్టించుకున్నా కేడర్ వారి మాట వినకపోవడం వంటి ఇబ్బం దులు తలెత్తినట్లు తెలుస్తోంది. అం దుకే వారిని తొలగించి నారాజ్ చేయ డం కంటే వారిని అలాగే కొనసాగించి అదనంగా కీలక నేతలకు సభ్యత్వ నమోదుపై సమీక్షలు చేపట్టాలని ఆయ జిల్లాల బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో వారిని అసంతృప్తికి గురిచేస్తే పార్టీకి డ్యామేజ్ అన్న ఉద్దేశ్యంతో సభ్యత్వ నమోదుపై రివ్యూ బాధ్యతలు ఇతరులకు కేటాయించారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఏది ఏమైనా బీజేపీ జాతీయ నాయకత్వం ఇచ్చిన టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు స్టేట్ యూనిట్ చేస్తున్న కసరత్తు ఫలిస్తుందా? 8 రోజుల్లో 30 లక్షల టార్గెట్ ను రీచ్ అవుతారా? లేదా? అనేది చూడాలి.

Advertisement

Next Story

Most Viewed