కొలువుదీరిన కొత్త కొత్వాళ్లు.. డ్రగ్స్‌పై ఉక్కుపాదం

by Vinod kumar |
కొలువుదీరిన కొత్త కొత్వాళ్లు.. డ్రగ్స్‌పై ఉక్కుపాదం
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: డ్రగ్స్​విక్రయించేవారు.. వినియోగించేవారు ఇకపై ప్యాకప్​చెప్పుకోవాలని హైదరాబాద్​పోలీస్​కమిషనర్​కొత్తకోట శ్రీనివాస్​రెడ్డి హెచ్చరించారు. మాదక ద్రవ్యాల దందా చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. సినీ పరిశ్రమలో ఉన్న కొందరు తరచూ డ్రగ్​పార్టీలు చేసుకుంటున్న విషయం తన దృష్టిలో ఉందన్నారు. త్వరలోనే సినీ పరిశ్రమ పెద్దలతో దీనిపై సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు. అప్పటికీ డ్రగ్​పార్టీలు చేసుకోవటం మానేయక పోతే ఎంతటి వారైనా వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్​కొంత అవహేళనకు గురైందని చెబుతూ ఇకపై ఇలా ఉండదన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.

బంజారాహిల్స్​లోని పోలీస్ ​కమాండ్​ కంట్రోల్​లో హైదరాబాద్​కమిషనర్​గా ఇన్​ఛార్జ్ ​కమిషనర్​ సందీప్ ​శాండిల్య నుంచి బుధవారం శ్రీనివాస్​రెడ్డి కొత్వాల్​గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల సమాజంలో అన్ని వర్గాల ప్రజలను పట్టి పీడిస్తున్నాయని చెప్పారు. ఎక్కువగా పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, ఫాంహౌస్​లలో డ్రగ్స్​వాడకం జరుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. సినీ పరిశ్రమలో కూడా డ్రగ్స్​వాడకం గణనీయంగా ఉన్నట్టు తెలిసిందన్నారు. డ్రగ్స్​అమ్మకందారులపై ఎంత కఠిన చర్యలు తీసుకుంటామో వాటిని వినియోగిస్తున్న వారిపై కూడా అంతే స్థాయి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

డిమాండ్​ ఉంటే సప్లై ఉంటుందని చెబుతూ డిమాండ్​లేకుండా చేయటమే తమ లక్ష్యమని చెప్పారు. దీనికి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా వదిలి పెట్టే ప్రసక్తి లేదని చెప్పారు. డ్రగ్​పెడ్లర్స్..డ్రగ్​కన్స్యుమర్స్​లీవ్​అవర్​సిటీ అండ్​ది స్టేట్​అని హెచ్చరించారు. సమాజంలో ఉన్న చెడ్డవారికే ఈ హెచ్చరిక అని వ్యాఖ్యానించారు. చట్టాలను గౌరవించే వారితో పోలీసులు ఎప్పుడూ స్నేహ పూర్వకంగానే ఉంటారన్నారు. శాంతిభద్రతలను కాపాడటానికి ఇలాంటి వారి సహకారం తీసుకుంటూ ముందుకు వెళతామన్నారు. హైరరాబాద్​విశ్వనగరంగా రూపుదిద్దుకొంటోందని చెబుతూ ఇలాంటి సిటీల్లో ప్రధానంగా మూడు సవాళ్లు ఉంటాయన్నారు. అందులో ఒకటి క్విక్​రెస్పాన్స్​కావటమని చెప్పారు. ఏదైనా సంఘటన జరిగితే వీలైనంత తక్కువ సమయంలో నేరస్థలానికి చేరుకున్నపుడు పరిస్థితులను వెంటనే అదుపులోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుందన్నారు. సాంకేతిక, ఇతరత్రా అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుని శాంతిభద్రతలను కాపాడుతామన్నారు. మహిళల పట్ల జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేయటానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.

ఈవ్​టీజింగ్​వంటి సమస్యల పరిష్కారానికి షీ టీమ్స్​మరింత సమర్థవంతంగా పని చేసేట్టు చూస్తామని చెప్పారు. హైదరాబాద్​పొరుగునే ఉన్న సైబరాబాద్, రాచకొండ కమిషనర్లతో సమన్వయాన్ని ఏర్పాటు చేసుకుని పని చేస్తామన్నారు. నా శక్తి సామర్థ్యాలను గుర్తించి హైదరాబాద్​పోలీస్​కమిషనర్​గా నియమించిన ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 450 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన హైదరాబాద్​నగరం అన్ని రకాల ప్రజలకు ఆలవాలమన్నారు. మినీ భారత్​గా చెప్పే హైదరాబాద్​ప్రతిష్టను మరింత ఇనుమడింప చేసేలా పోలీసింగ్​చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు సీపీ (లా అండ్​ఆర్డర్) విక్రమ్​సింగ్​మాన్, అదనపు సీపీ (స్పెషల్​బ్రాంచ్) విశ్వప్రసాద్, జాయింట్​కమిషనర్​(అడ్మిన్) పరిమళ హనా నూతన్, జాయింట్​సీపీ (క్రైమ్స్, సిట్) గజరావు భూపాల్, వెస్ట్​జోన్​డీసీపీ జోయెల్​డేవిస్, ఎస్ఎంఐటీ డీసీపీ రాధేష్​మురళి తదితరులు పాల్గొన్నారు.

నిష్పక్షపాతంగా.. చట్టబద్దంగా పని చేస్తాం : సైబరాబాద్​ కమిషనర్ ​అవినాష్​ మహంతి

ఐటీతోపాటు పలు ప్రముఖ సంస్థల కార్యాలయాలు ఉన్న సైబరాబాద్​ కమిషనురేట్​ ఎంతో ప్రత్యేకమైనదని అవినాష్​మహంతి అన్నారు. ఈ క్రమంలో శాంతిభద్రతల పరిరక్షణకు నిష్పక్షపాతంగా, చట్టబద్దంగా పని చేస్తామన్నారు. సైబరాబాద్​కమిషనర్​గా బుధవారం స్టీఫెన్​రవీంద్ర నుంచి అవినాష్​మహంతి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించటానికి తమ వద్ద ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటామన్నారు. అతి పెద్ద సమస్యగా మారిన సైబర్​నేరాలను అరికట్టటానికి ప్రత్యేక దృష్టిని సారిస్తామన్నారు. ప్రజలకు అండగా మేమున్నామన్న భరోసాను కల్పిస్తామని చెప్పిన అవినాష్​మహంతి అన్ని రకాల కేసులను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామన్నారు.

కమిషనరేట్​ పరిధిలో ట్రాఫిక్​సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. దీని కోసం కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తామని చెప్పారు. ఇక, మాదక ద్రవ్యాల దందాను కఠినంగా అణచి వేస్తామన్నారు. డ్రగ్స్​ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయన్న దానిపై దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. డిసెంబర్​31న నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ జరుపుకునే వేడుకలను పోలీసు నిబంధనలకు అనుగుణంగా జరుపుకోవాలని చెప్పారు. పబ్బులు, ఫాంహౌస్​లలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెడతామన్నారు.

మహిళా సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు.. రాచకొండ కమిషనర్​ సుధీర్​బాబు

మహిళల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని రాచకొండ కమిషనర్​సుధీర్​బాబు చెప్పారు. డ్రగ్స్​సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా విస్తృతస్థాయిలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టిని సారిస్తామన్నారు. రాచకొండ కమిషనరేట్​లో బుధవారం ఆయన ఇంతకు ముందు కమిషనర్​డీ.ఎస్. చౌహాన్​నుంచి కమిషనర్​గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ శాంతిభద్రతల పరరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. దీని కోసం సివిల్, ఏఆర్​బెటాలియన్, ట్రాఫిక్​తదితర విభాగాల సిబ్బందిని సమన్వయం చేసుకుంటామని చెప్పారు. నానాటికీ పెరిగిపోతున్న సైబర్​నేరాలకు కళ్లెం వేయటానికి పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. సైబర్​నేరాలపట్ల ప్రజల్లో అవగాహన కల్పించటానికి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. గతంలో రాచకొండ అదనపు కమిషనర్​పని చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన కమిషనరేట్​పరిధిలోని అన్ని ప్రాంతాలపై సంపూర్ణ అవగాహన ఉన్నట్టు చెప్పారు.

హైదరాబాద్, సైబరాబాద్​ కమిషనరేట్లతో సమన్వయం ఏర్పరుచుకుని శాంతిభద్రతల రక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేట్టు చూస్తామని చెప్పారు. భూ సంబంధిత నేరాలపై ప్రత్యేక దృష్టిని సారిస్తామని తెలిపారు. రౌడీషీటర్లపై నిఘా ఉంటుందన్నారు. శాంతిభద్రతల రక్షణకు అవసరమైతే రిటైర్డ్​అధికారుల సలహాలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో రాచకొండ అదనపు కమిషనర్​తరుణ్​జోషి, మల్కాజిగిరి డీసీపీ జానకీ, మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్, ఎల్బీనగర్​డీసీపీ సాయి శ్రీ, ఉమెన్​సేఫ్టీ వింగ్​డీసీపీ ఉషా విశ్వనాథన్, రోడ్డు సేఫ్టీ డీసీపీ శ్రీబాల, క్రైమ్స్​డీసీపీ అరవింద్, అడ్మిన్​డీసీపీ ఇందిర తదితరులు పాల్గొన్నారు. కమిషనర్​గా బాధ్యతలు చేపట్టిన తరువాత సుధీర్​బాబు మర్యాద పూర్వకంగా ఇన్​ఛార్జ్​డీజీపీ రవిగుప్తాను ఆయన కార్యాలయంలో కలిశారు.

Advertisement

Next Story

Most Viewed