టీయుసీఐలో ఐఎఫ్‌టీయు విలీనం.. దేశవ్యాప్త కార్మికోద్యమంలో భాగమే

by Mahesh |
టీయుసీఐలో ఐఎఫ్‌టీయు విలీనం.. దేశవ్యాప్త కార్మికోద్యమంలో భాగమే
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఐఎఫ్‌టీయును టీయుసీఐలో విలీనం చేస్తూ జరిగే సభను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టి యు) ఆధ్వర్యంలో మున్సిపల్ సర్కిల్ టు కార్యాలయం వద్ద విలీన సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్త కార్మిక ఉద్యమ నిర్మాణంలో భాగమే టీయుసీఐలో ఐఎఫ్‌టీ‌యును విలీనం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈనెల 20న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలీన సభ నిర్వహిస్తున్నామన్నారు. మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లుగా కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందన్నారు. దేశ సంపదను, కార్మికుల జీవితాలను కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెడుతోందని ఆయన విమర్శించారు.

మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టడానికి బలమైన కార్మిక ఉద్యమ నిర్మాణం అవసరమన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 14రాష్ట్రాల్లో కార్మికుల పక్షాన పోరాడుతున్న టియుసిఐలో ఐఎఫ్‌టి‌యు‌ను విలీనం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో దేశంలో కార్మికుల హక్కుల కోసం కనీస వేతనాల అమలు కోసం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్‌ల రద్దు కోసం మరింత విప్లవ స్ఫూర్తితో పోరాడుతామన్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో రెండు కార్మిక సంఘాల విలీనం జరిగిందన్నారు. ఈనెల 20న జరిగే సభను మున్సిపల్ కార్మికులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కిరణ్, గంగాధర్, శాంతి కుమార్, శివకుమార్, లక్ష్మయ్య, వరలక్ష్మి, శైలజ, నర్సయ్య, విజయ్, లక్ష్మి, గంగామణి, సరస్వతి, గంగారం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story