గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

by Naveena |
గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీ.జీ.పీ.ఎస్.సీ)తో నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించనున్న గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నవంబర్ 17, 18 తేదీలలో జరిగే గ్రూప్-3 పరీక్షలు, డిసెంబర్ 15, 16 తేదీలలో నిర్వహించనున్న గ్రూప్-2 రాత పరీక్షలను పురస్కరించుకుని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎం.మహేందర్ రెడ్డి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ తో ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులు, నోడల్ ఆఫీసర్లు, ప్రాంతీయ సమన్వయకర్తలతో పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5.50 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్న దృష్ట్యా ఇప్పటినుండే పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా, ప్రశాంత వాతావరణంలో సాఫీగా పరీక్షలు జరిగేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ..గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల కోసం జిల్లాలో మొత్తం 72 పరీక్షా కేంద్రాలను గుర్తించడం జరిగిందని, ఇప్పటికే ఆర్డీఓలు ఈ కేంద్రాలను సందర్శించి వసతి సదుపాయాలను పరిశీలించారని అన్నారు. గ్రూప్స్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు, ఇతర మెటీరియల్ ను కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య భద్రపరిచేందుకు ఐ.డీ.ఓ.సీలో ఒకటి, పోలీస్ హెడ్ క్వార్ట్రర్స్ లో మరొకటి చొప్పున మొత్తం రెండు స్ట్రాంగ్ రూంలను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఈ నెల 22 వ తేదీ లోపు స్ట్రాంగ్ రూమ్ లకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పిస్తామని, పరీక్షా కేంద్రాల వివరాలను కూడా ఆన్లైన్ తో పంపిస్తామని అన్నారు. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమిస్తామని, అవసరమైతే ఇతర శాఖల సహకారం తీసుకుంటామని తెలిపారు. ఎలాంటి అవాంతరాలు తావులేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని అన్నారు. వీడియో కాన్ఫరెన్సులో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, ప్రాంతీయ సమన్వయకర్తలు రాంమోహన్ రావు, సాయిరెడ్డి, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed