క్షమాపణ అడిగి మీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోండి: మంత్రి తుమ్మల

by Mahesh |
క్షమాపణ అడిగి మీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోండి: మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో : నూరు శాతం రుణమాఫీ అయినట్లు మేము ప్రకటించినట్లు ఒక విష ప్రచారానికి తెరలేపి రైతులను ఆందోళన పరుస్తున్నది మీరు(హరీష్ రావు)అని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మండిపడ్డారు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని, అసత్య ప్రచారాలు మానుకొని వడ్డీ మాఫీ చెయ్యకుండా వదిలేసిన 22 లక్షల కుటుంబాల దగ్గరకు వెళ్లి వాళ్లను క్షమాపణ అడిగి మీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోండి అని సూచించారు. రుణమాఫీ పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. రుణమాఫీపై, రైతు భరోసా పై స్పష్టమైన విధానంతో ముందుకెళ్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో లాగా ఒకసారి రూ.లక్ష రుణమాఫీకే 4 వాయిదాలు తీసుకుని, రెండోసారి 5వ సంవత్సరంలో సగం మందికి రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన వడ్డీ మాఫీ పథకాన్ని ప్రస్తావించే ధైర్యం లేక, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ పై అర్థం, పర్థం లేని ఆరోపణలు చేస్తూ రైతులను ఆందోళనలకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణకు, రైతాంగానికి ద్రోహం చేసింది ఎవరో, రుణమాఫీ పేరుతో నయవంచన చేసింది ఎవరో ఏ ఊరు కైనా, ఏ గడప కైనా వెళ్లి అడిగి చూడండి అని సూచించారు. కనీసం అప్పుడైనా గత నిర్వాకాలు మీకే తెలుస్తాయని హితవు పలికారు.

ఆ పని ఎలాగో మీరు చేయ్యరని, గత రెండు ఎన్నికల్లో కర్రు కాల్చి వాతలు పెట్టినా బుద్ధి రాలేదన్నారు. 2018 లో రుణమాఫీ అమలుకు కూడా కుటుంబమే యూనిట్ అని, ఆ కుటుంబ నిర్ధారణకు ప్రాతిపదిక ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ప్రకారం అని చెప్పినప్పటికీ ప్రామాణికంగా తీసుకున్నది రేషన్ కార్డే కదా? అని ప్రశ్నించారు. కాదని చెప్పగలరా? కేవలం సగం మందికే ఇచ్చి, 20.84 లక్షల మందికి ఎగ్గొట్టిన విషయం నిజం కాదా? అని నిలదీశారు. సగం మందికే చేసిన రుణమాఫీ లో కూడా 2.26 లక్షల మందికి సంబంధించిన 1419 కోట్ల రూపాయల రుణమాఫీ డబ్బులు తిరిగి ప్రభుత్వ ఖజానాకు వచ్చినా, వాటిని తిరిగి రైతుల ఖాతాలకు చెల్లించే ప్రయత్నం చేశారా? అన్నారు. ప్రతి ఒక్కరికి సమాచార పత్రం ఇచ్చి, అందులో కారణం పేర్కొని, వాటిని సరిదిద్దే విధంగా చేస్తున్నామని, కానీ బీఆర్ఎస్ లాగా తప్పించుకునే ప్రయత్నం చేయడం లేదన్నారు. ఒకరిద్దరు రైతులు కాదు.. 2018 రుణమాఫీ కాని 20 లక్షల మంది రైతుల పేర్లు ఇవ్వగలం అన్నారు. రుణమాఫీ 2024 పథకం అమలులో ఉన్నదని, గత ప్రభుత్వంలో లాగా ఐదేళ్ళు చేయబోమని, ఈ పంట కాలంలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

ఇచ్చిన మాట ప్రకారం వివరాలు క్లీయర్‌గా ఉన్న రైతులకు 2 లక్షల లోపు ఉన్న వారందరికీ రుణమాఫీ వర్తింప చేశామన్నారు. మొదటి పంటకాలంలోనే 22 లక్షల మందికి 18 వేల కోట్లు ఒకే విడతలో మాఫీ చేశామని, కుటుంబ నిర్ధారణ కాని వాళ్లని వ్యవసాయాధికారులు వివరాలు సేకరిస్తున్నారని, ఇప్పటికే 2.65 లక్షల మంది వివరాలు సేకరించామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలోనే 26,140.13 కోట్లు రైతు సంక్షేమానికి ఖర్చు చేశామన్నారు. గత ప్రభుత్వం చెల్లించకుండా బకాయిలు పెట్టిన యాసంగి రైతుబంధు, పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీ, పామాయిల్ రైతులకు చెల్లించాల్సిన ప్రోత్సహకాలు, డ్రిప్ కంపెనీ లకు ఇవ్వాల్సిన సబ్సీడీలు కూడా చెల్లించిన మాట నిజం కాదా?అని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధులో రూ.25,000 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారని రైతుల్లో అభిప్రాయం వ్యక్తం కావడంతో మరింత పకడ్బందీగా పంట వేసిన వారికి, కౌలు రైతులకు, సాగులో ఉన్న భూమికే రైతు భరోసా వర్తింపజేయడానికి నిశ్చయించి, విధివిధానాల రూపకల్పన జరుగుతున్నదన్నారు. గత పదేళ్ళలో ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయని వారు పది నెలలు కూడా గడవక ముందే, మైకులముందుకు వచ్చి గొంతు చించుకోవడం నిజంగా శోచనీయం అని మండిపడ్డారు. సీఎం చెప్పినా, డిప్యూటీ సీఎం, సహచర మంత్రులు చెప్పిన మా అందరిదీ ఒకటే మాట అని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed