Crime : కర్రలు, రాడ్డులతో యువకుడిపై హత్య ప్రయత్నం

by Kalyani |
Crime : కర్రలు, రాడ్డులతో యువకుడిపై  హత్య ప్రయత్నం
X

దిశ, మద్దూరు : పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని యువకుడిపై కర్రలు, రాడ్డులతో దాడి చేసి హత్య యత్నానికి పాల్పడిన సంఘటన మద్దూరు మండల కేంద్రంలో శనివారం రాత్రి జరిగింది. మద్దూరు ఎస్సై షేక్ మహబూబ్ ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం… మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన చిలుక లచ్చయ్య, చిలుక రాజు, చిలుక రాంబాబు, చిలుక పరిషరాములు, చిలుక బాబు, చిలుక మురళి, చిలుక ప్రేమ్ కుమార్, చిలుక మురళి నిందితులు పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని చిలక సతీష్ పై శనివారం రాత్రి కర్రలు, రాడ్డులతో దాడి చేసి హత్య యత్నానికి ప్రయత్నించినారని, చిలుక సతీష్ తలపై రాడ్డుతో గట్టిగా కొట్టడంతో తల పగిలిందని హైదరాబాద్ లోని దావఖాన లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

చిలుక సతీష్ తండ్రి దశరథం ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నానికి పాల్పడిన వారిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపినట్లు మద్దూరు ఎస్సై తెలిపారు. హత్యాయత్నానికి ప్రయత్నం జరగడంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బెటాలియన్ తో బందోబస్తు నిర్వహించారు. చేర్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ శ్రీను బందోబస్తు పర్యవేక్షణ చేస్తూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూశారు. హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీష్ కుమార్ మద్దూరు పోలీస్ స్టేషన్ సందర్శించి బందోబస్తు పై ఆరా తీశారు. ఎస్సీ కాలనీలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఇంకా కొనసాగుతుంది.

Advertisement

Next Story