ఈఎన్‌టీలో అధునాతన పురోగతులపై కాన్ఫరెన్స్

by Aamani |
ఈఎన్‌టీలో అధునాతన పురోగతులపై కాన్ఫరెన్స్
X

దిశ,కంటోన్మెంట్ : ఈఎన్‌టీలో ఆధునాతన పురోగతులపై సౌత్ జోన్ ఈఎన్‌టీ సర్జన్స్ కాన్ఫరెన్స్ 2024 శామీర్ పేట, ఆలంకృత రిసార్ట్ లో ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ఆఫ్ ఓటోలరింగాలజిస్ట్ ఆఫ్ ఇండియా టీజీ సౌత్ కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ డీఎస్ దీనదయాల్‌ తెలిపారు. ‌ఈ మేరకు బుధవారం ఈస్ట్ మారేడుపల్లిలోని షెనాయ్ నర్సింగ్ హోమ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కాన్ఫరెన్స్ ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించనున్నారని తెలిపారు. వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ కరుణాకర్ రెడ్డి అతిథిగా హాజరు కానున్నారని చెప్పారు. ఈ కాన్ఫరెన్స్ తెలంగాణలో 9వదని, సౌత్ జోన్ లో 19వదని అన్నారు. ప్రకృతి, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ కలిసే 'బేసిక్స్ అండ్ బియాండ్' అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఈ ఈవెంట్ ది అసోసియేషన్ ఆఫ్ ఓటోలరింగాలజిస్ట్ ఆఫ్ ఇండియా సౌత్ జోన్ (ఏఓఐ ఎస్ జెడ్) ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. మనకు ఐదు జ్ఞానేంద్రియాలు కలవన్నారు. అవి కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం అన్నారు. ఇవి మన దైనందిన జీవితానికి చాలా అవసరమన్నారు. వీటిలో కళ్లు తప్ప మిగతా నాలుగు ఈఎన్‌టీ సంరక్షణలోకి వస్తాయన్నారు. ఈ అవయవాల్లో ఏదైనా సమస్య వస్తే మన జీవన నాణ్యతను బాగా ప్రభావితం చేస్తుందన్నారు. అదృష్టవశాత్తూ.. ఈఎన్‌టీ ఫీల్డ్ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతికతతో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు. ప్రస్తుతం మనం లాలాజల గ్రంథి లోపల వీక్షించడానికి 1.2 మిమీ స్కోప్‌ని ఉపయోగించవచ్చన్నారు. రాళ్లను కచ్చితంగా తొలగించడానికి వీలు కలిగిస్తుందన్నారు. జీవితంలో కీలకమైన అంశం మాటలు కూడా ఈఎన్‌టీ కిందకు వస్తుందన్నారు.

ఈ కాన్ఫరెన్స్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక తదితర దక్షిణాది రాష్ట్రాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారని చెప్పారు. మూడు రోజులు జరగనున్న ఈ ఈవెంట్ ఈఎన్‌టీ నిపుణుల మధ్య సహకారం, జ్ఞానాన్ని పంచుకోవడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.‌ తద్వారా నైపుణ్యం, తాజా పురోగతులపై అవగాహన పెరుగుతుందన్నారు. వర్క్ షాపులు, ఉపన్యాసాలు, పరస్పర చర్చలతో కూడిన సమగ్రమైన శిక్షణ అనుభవం ఉంటుందన్నారు. సంప్రదాయ వైద్యం, ఆధునిక సాంకేతికత మధ్య వారధిగా నిలుస్తుందని డాక్టర్ డీఎస్ దీనదయాల్‌ తెలిపారు.మీడియా సమావేశంలో కాన్పరెన్స్ సమన్వయకర్త డాక్టర్ డి.ద్వారకానాథ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎన్.వెంకట్ రెడ్డిలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed