ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లు షురూ

by M.Rajitha |
ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లు షురూ
X

దిశ, వెబ్ డెస్క్ : ఎంబీబీఎస్, బీడీఎస్‌ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని మెడికల్, డెంటల్ కళాశాలల్లోని కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. నీట్ 2024 లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 4వ తేదీ ఉదయం 6 గంటల నుండి 13వ తేదీ సాయింత్రం 6 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. నిర్ధేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ లో సమర్పించిన ధరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ఇక తెలంగాణ నుంచి ఈసారి 49,184 మంది నీట్‌లో క్వాలిఫై అయ్యారు. వీరంతా దరఖాస్తు చేసుకునేందుకు వెలుసుబాటు ఉంటుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం మెరిట్ లిస్ట్‌(స్టేట్ ర్యాంక్స్‌)ను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత వెబ్‌ ఆప్షన్లు ప్రక్రియ ఉంటుంది. కాలేజీలు, సీట్ల వివరాలను వెబ్‌ఆప్షన్లకు ముందు వెల్లడించనున్నారు. మరోవైపు రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీకి, తెలంగాణకు ఉన్న 15 శాతం అన్‌రిజర్వ్‌డ్ కోటాను ప్రభుత్వం రద్దు చేయడంతో సీట్లు పెరగనున్నాయి. మరోవైపు స్థానికతను గుర్తించే విషయంలోనూ వర్సిటీ అధికారులు స్వల్ప మార్పులు చేశారు. గతంలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకూ 7 ఏండ్లలో, 4 ఏండ్లు తెలంగాణలో చదివితే తెలంగాణ విద్యార్థులు గుర్తించేవారు. ఈసారి ఆ నిబంధనలో మార్పు చేశారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకూ, వరసగా 4 ఏండ్లు తెలంగాణలో చదివినవాళ్లనే తెలంగాణ స్థానికులుగా గుర్తిస్తామని పేర్కొన్నారు.

Next Story

Most Viewed