ఎమ్మెల్యేల పార్టీ మార్పు వేళ వ్యూహం మార్చిన KCR.. కేడర్‌ను కాపాడుకునేందుకు గులాబీ బాస్ భారీ స్కెచ్..!

by Satheesh |   ( Updated:2024-07-02 13:04:18.0  )
ఎమ్మెల్యేల పార్టీ మార్పు వేళ వ్యూహం మార్చిన KCR.. కేడర్‌ను కాపాడుకునేందుకు గులాబీ బాస్ భారీ స్కెచ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో బీఆర్ఎస్ కోటకు బీటలు వారుతున్నాయి. పవర్ కోల్పోవడంతో ఒక్కరొక్కరుగా గులాబీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, మరి కొందరు కీలక నేతలు పార్టీ ఛేంజ్ అయ్యారు. బీఆర్ఎస్‌లో వలసల ప్రవాహం మొదలు కావడంతో అడ్డుకట్ట వేసేందుకు అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలను ఫామ్ హౌస్‌కు వారితో వరుస భేటీలు నిర్వహించారు. పార్టీ మారొద్దని, భవిష్యత్ మనదేనని భరోసా కల్పించడంతో పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీలు ఇస్తున్నారు. అయితే, కేసీఆర్ బుజ్జిగించినప్పటికీ ఆయన ముందు సరేనని.. తర్వాత కొందరు పార్టీ మారుతున్నారు. ఇటీవల పార్టీ మారిన ఎమ్మెల్యేలు కొందరు ఇదే రీతిలో వ్యవహరించారు.

దీంతో గులాబీ బాస్ స్ట్రాటజీ మార్చారు. ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలతో భేటీలు ముగియడంతో సెకండ్ కేడర్‌ను ఎంకరేజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు పార్టీ వీడిన వారి వెంట సెకండ్ కేడర్ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్. ఎమ్మెల్యేలు పార్టీ వీడిన సెకండ్ కేడర్ బలంగా ఉంటే.. క్షేత్ర స్థాయిలో పార్టీకి ఏ ప్రాబ్లమ్ ఉండదని.. ఈ వ్యూహంలో భాగంగానే సెకండ్ కేడర్‌ను ప్రోత్సహించాలని ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉండటం కూడా ఈ ప్లాన్‌కు మరింత కలిసి వస్తుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే 21 జిల్లాల జెడ్పీ చైర్మన్లతో ఫామ్ హౌజ్‌లో మంగళవారం కేసీఆర్ భేటీ అయ్యారు. జెడ్పీ చైర్మన్లతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా సమావేశానికి ఆహ్వానించారు.

జెడ్పీ చైర్మన్‌లతో కలసి లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసిన కేసీఆర్.. పార్టీ మారొద్దంటూ ఈ సందర్భంగా వారిని బుజ్జిగించినట్లు టాక్. ఎమ్మెల్యేలు పార్టీ మారిన వారి వెంట వెళ్లొద్దని.. మీరు పార్టీలోనే ఉండాలని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. భవిష్యత్ బీఆర్ఎస్‌దేనని, పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్నవారికి భవిష్యత్‌లో సముచిత స్థానం కల్పిస్తానని సైతం గులాబీ బాస్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలతో భేటీలు ముగిసిన వెంటనే కేసీఆర్ సెకండ్ కేడర్‌తో భేటీ కావడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తుంది. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీ మారుతారో తెలియని పరిస్థితి నెలకొనడంతోనే సెకండ్ కేడర్‌ను ఎంకరేజ్ చేయాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీలో ఎమ్మెల్యేల వలసల పర్వం కంటిన్యూ అవుతోన్న వేళ సెకండ్ కేడర్‌ను ప్రోత్సహించాలనుకున్న కేసీఆర్ వ్యూహం ఏ మేరకు ఫలిస్తోందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed