బండి దెబ్బకు బోర్లాపడ్డ బీఆర్ఎస్

by karthikeya |
బండి దెబ్బకు బోర్లాపడ్డ బీఆర్ఎస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రూప్-1 అభ్యర్థుల నిరసనలు పార్టీకి కలిసి వస్తాయని బీఆర్ఎస్ భావించింది. వారికి మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. వారిపక్షాన కొట్లాడుతామని పేర్కొన్నారు. కాగా, అభ్యర్థులకు మద్దతుగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ‘చలో సెక్రెటేరియట్’కు పిలుపునివ్వడంతో పాటు స్వయంగా పాల్గొన్నారు. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ నుంచి బీజేపీ వైపు ఫోకస్ మళ్లింది. గులాబీ నేతల్లో నైరాశ్యం నెలకొంది. అందివచ్చిన అవకాశాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జారవిడిచారని పార్టీ నేతలు అసహనంతో ఉన్నారు. వారిపక్షాన బీఆర్ఎస్ ముందుస్తుగా చలో సచివాలయం నిర్ణయిస్తే అభ్యర్థులతో పాటు నిరుద్యోగుల్లోనూ, యువతలోనూ మంచి ఆదరణ వచ్చేదని అభిప్రాయపడుతున్నారు.

అభ్యర్థులతో సుదీర్ఘంగా చర్చించిన కేటీఆర్

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు జీవో 29తో రిజర్వేషన్లకు గండికొడుతుందని అభ్యర్థులు ఆందోళన బాటపట్టారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు పలికి వారితో కలిసిపోయేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగానే పలుమార్లు నందినగర్‌కు, తెలంగాణ భవన్‌కు వచ్చిన అభ్యర్థులతో సుధీర్ఘంగా చర్చించారు. చర్చల పేరుతో వారితో కేటీఆర్ హడావిడి చేశారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కొద్దిమందిని చేరదీసి మొదట హైకోర్టులో పిటిషన్ వేయించారు. అభ్యర్థులకు వ్యతిరేకంగా రావడంతో సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేయించారు. వారికి భరోసా ఇచ్చారు. నిత్యం మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు కేటీఆర్ సూచనలు ఇచ్చారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలను పసిగట్టిన బీజేపీ ఆ ఇష్యూని టేకప్ చేయాలని భావించి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంట్రీ అయ్యారు. గాంధీనగర్ వెళ్లి గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనకు సంఘీభావం తెలపడంతో పాటు ‘చలో సెక్రెటేరియట్’కు పిలుపునివ్వడంతో పాటు వారికి కలిసి నడిచారు. ధర్నాకు దిగడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ ప్రోగ్రాంను బీజేపీ హైజాక్ చేసినట్లయింది. దీంతో అప్పటివరకు కలిసి వస్తుందనుకున్న గులాబీ నేతల్లో నైరాశ్యం నెలకొంది. ఏం చేయాలో అర్థంకాక కొంతమంది లీడర్లు అభ్యర్థులకు మద్దతు తెలిపడానికి వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో మైలేజ్ రాలేదని పార్టీ నేతలే పేర్కొంటున్నారు.

ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టని బీఆర్ఎస్

అభ్యర్థులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున బెట్టాలని, వైఫల్యాలను ఎండగట్టాలని కేటీఆర్ భావించారు. కానీ సరైన ప్రణాళికలు లేకపోవడంతో ఫెయిల్ అయ్యారని పార్టీలో చర్చ జరుగుతోంది. కోర్టులో కేసురూపంలోనే వెళ్లాలని భావించి ముందుకెళ్లారు. అభ్యర్థులకు నష్టం జరగకుండా చూడాలనే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. అయినప్పటికీ అశోక్‌నగర్‌కు సైతం వెళ్లి భరోసా కల్పించే ప్రయత్నం చేయలేదు. కేవలం వారిని నిత్యం మానిటరింగ్ చేస్తూ వచ్చారు. ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టలేదు. అభ్యర్థులకు నష్టం జరగకూడదనే పార్టీ ప్రత్యక్ష నిరసనలు చేపట్టలేదని పార్టీకి చెందిన సీనియర్ లీడర్ తెలిపారు. అయితే బండి సంజయ్ ఒక్కసారిగా ‘చలో సెక్రెటేరియట్’ ముట్టడికి పిలుపునిచ్చి పాల్గొనడంతో బీజేపీకి మైలేజ్ వచ్చినట్లయింది. దీంతో ఒక్కసారిగా గులాబీ నేతలు డైలమాలో పడ్డారు. ముందే గ్రహించి అభ్యర్థులకు మద్దతుగా పార్టీనే తీసుకుంటే మంచి ఆదరణ వచ్చేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కలిసొచ్చే అంశాన్ని కేటీఆర్ చేజేతులా వదిలివేశారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులకు భరోసా కల్పించే అవకాశం ఉన్న కార్యక్రమాన్ని వదిలివేసుకున్నామని పార్టీ నేతల్లో చర్చమొదలైంది.

యువతను ఆకట్టుకునేందుకు గులాబీ మల్లగుల్లాలు

నిరుద్యోగులంతా గులాబీపై గుర్రుగా ఉన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని, ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించినా ఫలితాలు విడుదల చేయలేదని ఆగ్రహంతో ఉన్నారు. అయితే గ్రూప్-1 అభ్యర్థులకు సంబంధించిన జీవోతో రిజర్వేషన్ పొందేవారు ఓపెన్ కేటగిరిలో ఉద్యోగం పొందే అర్హత కోల్పోతున్నారని ఆందోళనబాటపట్టడంతో బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండటంతో సంప్రదించారు. పోరాటబాటపట్టారు. ఇది సైతం చేజారీపోవడంతో ఏ అంశంతో మళ్లీ నిరుద్యోగుల మధ్యకు పోవాలి. వారి మద్దతు ఎలా కూడగట్టుకోవాలో తెలియక నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. త్వరలో రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగులు కీలకం కానుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దూరం కావడంతోనే ఓటమిపాలయ్యామని పార్టీ నేతలు బహిరంగంగానే పేర్కొంటున్నారు. యువత పక్షాన బీఆర్ఎస్ ఏ కార్యక్రమం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed