BREAKING: రైతు భరోసా స్కీమ్‌పై తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం

by Satheesh |
BREAKING: రైతు భరోసా స్కీమ్‌పై తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: రైతు భరోసా స్కీమ్‌పై తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా పథకం విధివిధానాలు రూపొందించేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సబ్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించనుండగా.. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులను సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ రైతు భరోసా స్కీమ్‌కు సంబంధించిన గైడ్ లైన్స్‌ను తయారు చేసి నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. కాగా, రైతులకు పంట పెట్టుబడి సాయం అందించడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు స్కీమ్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల రాష్ట్రంలో పవర్‌లోకి కాంగ్రెస్ ఈ స్కీమ్ పేరును రైతు భరోసాగా మార్చింది. రైతు బంధు పథకం కింద బీఆర్ఎస్.. ఏడాదికి ఒక ఎకరానికి రూ.10 వేల ఆర్థిక సహయం అందించగా.. కాంగ్రెస్ ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది.

అయితే, రైతు బంధు పథకం వల్ల రైతుల కంటే ఎక్కువ భూస్వాములే లాభపడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. రోడ్లు, వెంచర్లు, గుట్టల్లో ఉన్న భూములకు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిందని.. దీంతోనే ఈ స్కీమ్‌లో మార్పులు చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే కేవలం 10 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే రైతు భరోసా ఇంప్లిమెంట్ చేయాలా..? లేక రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ యోజన్ స్కీమ్ గైడ్ లైన్స్‌నే రైతు భరోసా స్కీమ్ వర్తింప చేయాలా అని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రైతు భరోసా స్కీమ్ గైడ్ లైన్స్ రూపొందించడానికి తాజాగా ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. దీంతో రైతు భరోసా స్కీమ్‌పై రేవంత్ రెడ్డి సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రైతుల్లో ఉత్కంఠ నెలకొంది.

Next Story