Congress: హర్యానాలో కాంగ్రెస్ కు షాక్.. ‘ఆప్’ వల్లే కొంప మునిగిందా?

by Prasad Jukanti |   ( Updated:2024-10-08 08:18:28.0  )
Congress: హర్యానాలో కాంగ్రెస్ కు షాక్.. ‘ఆప్’ వల్లే కొంప మునిగిందా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల్లో పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. ఇక్కడ ఒంటరిగా బీజేపీని గద్దె దింపి రాబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ తో పాటు ఆపే ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావించింది. అయితే కాంగ్రెస్ ఆలోచన ఒకలా ఉంటే ప్రజల తీర్పు మరోలా ఉండటం ఇప్పుడు హస్తం పార్టీని షాక్ కు గురి చేసింది. హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని అంతా లెక్కలు వేసినా తుది ఫలితాలు మాత్రం మరోలా కనిపస్తున్నాయి. ముచ్చటగా మూడోసారి ఇక్కడ బీజేపీకే ప్రజలు పట్టం కట్టారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవసరమైన మెజార్టీ స్థానాలైన 46 సీట్లలో కమలం పార్టీనే లీడ్ లో కొనసాగుతున్నది. దీంతో తప్పక గెలుస్తామని భావించిన రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ ను హ్యాట్రిక్ టైమ్ ప్రతిపక్షానికే పరిమితం చేయడం వెనుక స్వయంకృతాపరాదం ఉందా అనే చర్చ పొలిటికల్ కారిడార్ లో వినిపిస్తోంది.

కొంప ముంచిన ఒంటరి పోరు?:

లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిగా పొత్తు పెట్టుకుని సక్సెస్ సాధించిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత జరుగుతున్న జమ్మూ కశ్మీర్, హర్యానా ఎన్నికల్లో పొత్తుల విషయంలో భిన్నంగా వ్యవహిరించింది. కశ్మీర్ లో ఎన్సీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రాగా ఒంటరిగా వెళ్లిన హర్యానాలో మాత్రం ఓటమి పాలైంది. దీంతో హర్యానాలో కాంగ్రెస్ ఓటమి వెనుక ఆప్ విషయంలో హస్తం పార్టీ వ్యవహరించిన అతి విశ్వాసమే కొంప ముంచిందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నది. నిజానికి హర్యానాలో ఆమ్ ఆద్మీతో పొత్తు విషయంలో చివరి వరకు చర్చలు జరిగాయి. పొత్తు విషయంలో ఏఐసీసీ ఆగ్రనేత రాహుల్ గాంధీ సుముఖంగానే ఉన్నారనే ప్రచారం జరిగింది. కానీ రాష్ట్ర నాయకత్వం మొండి వైఖరి వల్లే పొత్తు కుదరలేదనే వాదన వినిపించింది. ఇక్కడ మొదట ఆమ్ ఆద్మీ 10 స్థానాలు డిమాండ్ చేయగా ఆప్ కు గరిష్టంగా ఐదు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధం అయింది. అయితే ఈ డీల్ కుదరకపోవడంతో ఇరు పార్టీలు ఒంటరిగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత లోక్ సభ స్థానాల్లో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో పోటీ చేసి అందులో ఐదు గెలుచుకోగా, ఒక చోట పోటీ చేసిన ఆప్ ఓటమి పాలైంది. దీంతో ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ తోనే పోటీ ఉందని అందువల్ల ఆప్ తో పొత్తు వద్దని పలువురు రాష్ట్ర అగ్రనేతలు అధిష్టానంపై ఒత్తిడి చేయడంతో పొత్తు ముచ్చట బ్రేకప్ అయిందనే వాదన ఉంది. దీంతో ఆప్ పోటీ ఓట్ల విభజన ద్వారా బీజేపీకి పరోక్షంగా లబ్ధి చేకూర్చిందనే చర్చ తెరపైకి వస్తోంది.

తెలంగా కాంగ్రెస్ లో అలా హర్యానాలో ఇలా?:
హర్యానా ఫలితాల నేఫథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అంశాన్ని రాజకీయ నిపుణులు ప్రస్తావిస్తున్నారు. తెలంగాణతోపాటు హిమాచల్ ప్రదేశ్, కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ఈ రాష్ట్రాల్లోని నేతలు అధిష్టానం సూచనతో సంయమనం పాటిస్తూ ఎన్నికలకు వెళ్లారని ముఖ్యంగా అంతర్గత విభేదాలతో ప్రత్యర్థుల ముందు పలుచనకాకుండా తామంతా ఒక్కటేనని చాటిచెప్పేలా వ్యవహరించారని చెబుతున్నారు. అదే సమయంలో ప్రత్యర్థులను బలహీనపరిచేందుకు అవసరమైతే చిన్న పార్టీలతోనూ పొత్తులకు వెనుకాడకుండా కలుపుకుపోయారు. దీంతో ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పట్ల సానుకూల వేవ్ ఏర్పడటంతో పాటు ఓట్లను కూడా తమ వైపు రాబట్టుకోగలిగారనే చర్చ జరిగుతోంది. అదే హర్యానా కాంగ్రెస్ లోనీ హై ప్రొఫైల్ లీడర్ల మధ్య ఆధిపత్య పోరుతో కాంగ్రెస్ పార్టీని ఓట్లను సీట్లుగా మార్చుకోవడంలో వెనుకపడేలా చేసిందనే టాక్ వినిపిస్తోంది. మాజీ సీఎం భూపీందర్ హుడా, కుమారి సెల్జా, రణదీప్ సూర్జేవాలా వంటి నాయకుల మధ్య ఆధిపత్య పోరు పార్టీని డ్యామేజ్ చేసిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలోనే కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయ లోపాన్ని బీజేపీ టార్గెట్ చేసింది. ఓ వైపు పొత్తుల విషయంలో అధిష్టానంతో విభేదించిన రాష్ట్ర నాయకత్వం తమ మధ్య సమన్వయలోపాన్ని సరిదిద్దుకుని ప్రజల్లోకి సమిష్టిగా వెళ్లలేకపోవడం వల్లే ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి చేదుగా వచ్చిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Advertisement

Next Story

Most Viewed