Rains : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు 432 రైళ్లు రద్దు.. బస్సు సర్వీస్‌లు సైతం

by Ramesh N |   ( Updated:2024-09-02 15:21:11.0  )
Rains : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు 432 రైళ్లు రద్దు.. బస్సు సర్వీస్‌లు సైతం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 432 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అలాగే 140 రైళ్లు దారి మళ్లించినట్లు వెల్లడించింది. దీంతో పాటు మరో 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు పేర్కొంది. రద్దయిన వాటిలో పలు పాసింజర్ రైళ్లు, సూపర్ ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి.

ఇంటికన్నె- కేసముద్రం రైల్వే ట్రాక్ మరమత్తులు

వర్షాల కారణంగా తెలంగాణలోని కేసముద్రం మండలంలోని ఇంటికన్నె-కేసముద్రం రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ పూర్తిగా ధ్వంసం అయింది. దీంతో ఈ రూట్‌లో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో యుద్ధ ప్రాతిపదికన రైల్వే అధికారులు మరమత్తులు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఘటన స్థలానికి చేరుకొని స్వయంగా పర్యవేక్షించారు. 418, 432 కిలోమీటర్ వద్ద పట్టాలు బాగా దెబ్బతిన్నాయని, ఈ మార్గంలో మొత్తం ఐదు చోట్ల పట్టాలు ధ్వంసం అయ్యాయని, వాటి మరమత్తు పనులు పూర్తి చేస్తున్నామని ఆయన తెలిపారు. నాలుగు చోట్ల పునరుద్దరణ పనులు ముగిశాయని వెల్లడించారు.

వందలాది బస్సు సర్వీసులు రద్దు

వర్షాల కారణంగా హైదరాబాద్ విజయవాడ మధ్య రోడ్డు రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. తెలంగాణ ఆర్టీసీ ఇప్పటి వరకు 560 పైగా సర్వీసులను రద్దు చేసింది. ఖమ్మం 160, వరంగల్ 150, రంగారెడ్డి జిల్లాలో 70 పైగా బస్సులను నిలిపివేసినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story