సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ విడుదల

by Sridhar Babu |
సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ విడుదల
X

దిశ, గోదావరిఖని : సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ విడుదలైంది. ఈ మొత్తాన్ని శుక్రవారం కార్మికులకు చెల్లించనున్నారు. ఈమేరకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం సచివాలయంలో ప్రకటించారు. దీని కోసం సింగరేణి సంస్థ 358 కోట్ల రూపాయలను విడుదల చేయాలని సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ ను ఆదేశించారు. గత ఏడాది చెల్లించిన దీపావళి బోనస్ కన్నా ఇది రూ.50 కోట్లు అధికం కావడం విశేషం.

శుక్రవారం మధ్యాహ్నంలోగా దీపావళి బోనస్ ను కార్మికుల ఖాతాల్లో జమ చేయాల్సిందిగా డిప్యూటీ సీఎం ఆదేశించారు. దీపావళి బోనస్ కింద ఒక్కొక్క కార్మికుడు రూ.93,750 అందుకోనున్నారు. ఈ బోనస్ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 40 వేల మంది కార్మికులకు వర్తిస్తుంది. జే.బీ.సీ.సీ.ఐ. విధానాల్లో భాగంగా కంపెనీలు సాధించిన ఉత్పత్తి పరిమాణం ఆధారంగా కార్మికుల శ్రమకు ప్రోత్సాహకంగా ఈ బోనస్ ను చెల్లించే పద్ధతి గత కొన్నేళ్లుగా అమలులో ఉంటోంది. ఈ ఏడాది కూడా కోల్ ఇండియా స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా దీపావళి పండుగకు ముందే చెల్లింపులు జరిగేలా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు.

ఈనెలలో రూ.1250 కోట్లు చెల్లింపు

కాగా ఇటీవలే సింగరేణి ఉద్యోగులందరికీ 33 శాతం లాభాల వాటా కింద 796 కోట్ల రూపాయలను కంపెనీ పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఒక్కొక్క కార్మికుడికి సగటున లక్షా 90 వేల రూపాయలు అందాయి. అలాగే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రూ.5 వేల చొప్పున చెల్లించారు. పండుగ అడ్వాన్స్ కింద ఒక్కొక్క కార్మికుడికి 25వేల రూపాయలు చొప్పున మరో 90 కోట్ల రూపాయలను కంపెనీ చెల్లించింది. ఇప్పుడు దీపావళి బోనస్ కింద ఒక్కొక్కరికి సగటున రూ.93,750 లభిస్తాయి. మొత్తం మీద ఈనెల రోజుల వ్యవధిలో దీపావళి బోనస్, లాభాల వాటా, పండుగ అడ్వాన్స్ కింద రూ.1250 కోట్ల ను కంపెనీ చెల్లించింది.

ఈ విధంగా సగటున సింగరేణి ఉద్యోగులు ఈ నెల రోజుల కాలంలో ఒక్కొక్కరు సుమారు మూడు లక్షల రూపాయల వరకు అందుకున్నారు. బోనస్ చెల్లింపుపై తగు ఏర్పాటు చేయాలని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ పర్సనల్, ఫైనాన్స్ విభాగం అధికారులను ఆదేశించారు. ఈ బోనస్ డబ్బులను దుబారా చేయవద్దని, ప్రభుత్వ పొదుపు సంస్థల్లో దాచుకోవాలని, కుటుంబ అవసరాలకు అనుగుణంగా జాగ్రత్తగా వెచ్చించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story