Mann Ki baat : 113వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని మోడీ

by Shamantha N |
Mann Ki baat : 113వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: చంద్రయాన్-3 విజయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని.. ప్రజల సమష్టి కృషి వల్లే ఇదంతా సాధ్యమైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆదివారం 113వ సారి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 21వ శతాబ్దంలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయని.. ఇది దేశ పునాదిని పటిష్టం చేస్తుందన్నారు. అభివృద్ధి చెందిన భారత్‌కు పునాది మరింత బలపడుతుందన్నారు. చంద్రయాన్ 3 విజయానికి గుర్తుగా ఆగస్టు 23న తొలి జాతీయ దినోత్సవంగా నిర్వహించుకున్నామని గుర్తుచేశారు. గతేడాది ఆగస్టు 23న చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ భాగంలోని శివ-శక్తి పాయింట్ వద్ద విజయవంతంగా ల్యాండ్ అయిందన్నారు. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్‌ నిలిచిందని పేర్కొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో స్పేస్‌టెక్ స్టార్ట్-అప్ గెలాక్స్ ఐ బృందంతో మోడీ సంభాషించారు.

యువత రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు

పెద్ద సంఖ్యలో యువత రాజకీయాల్లోకి రావడానికి సుముఖంగా ఉన్నారని మోడీ పేర్కొన్నారు. వారికి కావాల్సిందల్లా సరైన అవకాశం, మార్గదర్శకత్వం మాత్రమేనని పేర్కొన్నారు. రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువతను రాజకీయ వ్యవస్థతో అనుసంధానం చేయాలని ఈ ఏడాది ఎర్రకోట నుంచి పిలుపునిచ్చానన్నారు. దీనిపై విపరీతమైన స్పందన వచ్చిందన్నారు. దీన్ని బట్టి రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారో అర్థమవుతుంది. వారు సరైన అవకాశం, సరైన మార్గదర్శకత్వం కోసం చూస్తున్నారు. కుటుంబ రాజకీయాలు కొత్త ప్రతిభను అణచివేస్తాయని పలువురు తనకు తెలిపారని అన్నారు. ఈ అంశంపై సూచనలు చేసినవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు మన సమిష్టి కృషితో రాజకీయ నేపథ్యం లేని యువత కూడా రాజకీయాల్లో ముందుకు రాగలరని అన్నారు. రాజకీయాల్లో యువత అనుభవం, ఉత్సాహం దేశానికి ఉపయోగపడతాయని ప్రధాని మోడీ అన్నారు. రాజకీయ నేపథ్యం లేని యువత రాజకీయాల్లోకి రావాలని ప్రధాని మోడీ అన్నారు. కుటుంబ ఆధారిత రాజకీయాలు కొత్త ప్రతిభను అణిచివేస్తాయి. స్వాతంత్ర్య ఉద్యమంలో రాజకీయ నేపథ్యంలేని అన్ని వర్గాలు పాల్గొన్నాయని అన్నారు. వారందరూ దేశం కోసం త్యాగాలు చేశారన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ఆ స్ఫూర్తే కావాలన్నారు.

హర్ ఘర్ తిరంగా ప్రచారం

'హర్ ఘర్‌తిరంగా' ప్రచారం యావత్‌ దేశాన్ని ఏకతాటిపై నడిపించిందని ప్రధాని మోడీ అన్నారు. ఈసారి ఈ ప్రచారం గరిష్ట స్థాయికి చేరుకుందన్నారు. మోడీ మాట్లాడుతూ.. ‘దేశంలోని నలుమూలల నుండి ఈ ప్రచారానికి విపరీతమైన స్పందన వచ్చింది. ఇళ్లపై సహా అన్నిచోట్ల త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించడం చూశాం. ఈ ప్రచారం యావత్ దేశాన్ని ఒకదానితో ఒకటి ముడిపెట్టింది. ఇది ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్’ అని అన్నారు. మోడీ తన ప్రసంగంలో అస్సాంలోని టిన్సుకియా ప్రాంతం గురించి ప్రస్తావించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని యువత జంతువులపై ప్రేమతో వాడుతున్న సరికొత్త త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ గురించి మాట్లాడారు. మధ్యప్రదేశ్‌లోని జుబువాలోని పారిశుద్ధ్య కార్మికులను ప్రశంసించారు.

Advertisement

Next Story

Most Viewed