బూత్‌ల వారీగా ఓటరు వివరాలను అందించాలని ఈసీని ఆదేశించలేం: సుప్రీంకోర్టు

by Harish |
బూత్‌ల వారీగా ఓటరు వివరాలను అందించాలని ఈసీని ఆదేశించలేం: సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికలు జరుగుతున్న సమయంలో అన్ని పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్‌కు సంబంధించిన తుది డేటాను వెబ్‌సైట్‌లో ప్రచురించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలన్న పిటిషిన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. అయితే దీనిపై లోక్‌సభ ఎన్నికల తర్వాత విచారణ చేస్తామని పేర్కొంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి దశ పోలింగ్ ముగిసిన 48 గంటల్లోగా పోలింగ్ స్టేషన్‌ల వారీగా ఓటర్ల ఓటింగ్‌ వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే స్వచ్ఛంద సంస్థ పిటిషన్‌ వేయగా, దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ విధంగా పేర్కొంది.

న్యాయమూర్తులు దీపాంకర్ దత్తా, సతీష్ చంద్ర శర్మలతో కూడిన బెంచ్ మాట్లాడుతూ, ఇప్పటికే ఐదు దశల పోలింగ్ ముగిసింది. ఇలాంటి పరిస్థితుల్లో బూత్‌ల వారిగా డేటాను సైట్‌లో అప్‌లోడ్ చేయాలంటే ఈసీ భారీ స్థాయిలో మానవ వనరులను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఈ విషయంలో ఈసీకి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేము. ఎన్నికలు పూర్తయిన తర్వాత దీనిపై విచారణ చేస్తామని తెలిపారు. విచారణ సందర్భంగా ఈసీ మాట్లాడుతూ, ఈ పిటిషన్ కేవలం అనుమానం, భయంతో కూడుకుంది. ఓటర్ల మనస్సులో అనుమానాలు రేకెత్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ధర్మాసనానికి తెలిపింది. ఎన్నికలను నిర్వహించడం చాలా కష్టమైన పని, డేటాను ప్రచురిస్తే ఎన్నికల ప్రక్రియకు హాని కలుగుతుందని ఈసీ పేర్కొంది.

Read More..

బైక్ పై యువ జంట రొమాన్స్.. అదే జంటతో మరో వీడియో చేయించిన పోలీసులు!



Next Story