అక్కడి నుంచే దేశ నూతన ప్రయాణం ప్రారంభం: ప్రధాని నరేంద్ర మోడీ

by samatah |
అక్కడి నుంచే దేశ నూతన ప్రయాణం ప్రారంభం: ప్రధాని నరేంద్ర మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ జరగబోతుందని, అక్కడి నుంచే దేశ భవిష్యత్‌కు నూతన ప్రయాణం ప్రారంభమవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు భారత్ ఆత్మ విశ్వాసంతో పరిష్కారాలను చూపుతోందని తెలిపారు. సత్యం, అహింస వంటి సూత్రాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శిస్తుందని కొనియాడారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఆదివారం 2550వ భగవాన్ మహవీర్ నిర్వాణ మహోత్సవాన్ని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్టాంపు, నాణేన్ని కూడా విడుదల చేశారు. అనంతరం ప్రసంగిస్తూ..యూపీఏ హయాంలో దేశం నిరాశలో మునిగిపోయిందని విమర్శించారు.

2014లో ఎన్డీయే అధికారంలోకి రాగానే తమ ప్రభుత్వం వారసత్వ సంపదను పెంపొందించడంతో పాటు భౌతికాభివృద్ధికి పెద్దపీట వేసిందని తెలిపారు. యోగా, ఆయుర్వేదం వంటి భారతీయ వారసత్వాన్ని ఎన్డీయే ప్రభుత్వం ప్రోత్సహించిందని చెప్పారు. దేశంలోని కొత్త తరం ప్రస్తుతం ఆత్మగౌరవమే గుర్తింపుగా విశ్వసిస్తోందన్నారు. ప్రపంచ స్థాయిలో దేశ బలం పెరుగుతుందని చెప్పారు. ‘అమృత్ కాల్’ ఆలోచన కేవలం సంకల్పం మాత్రమే కాదని, భారతదేశ ఆధ్యాత్మిక ప్రేరణ అని స్పష్టం చేశారు. భగవాన్ మహావీర్ ప్రబోదించిన శాంతి, కరుణ, సౌభ్రాతృత్వం దేశంలోని ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలిచాయని ప్రశంసించారు.

Advertisement

Next Story