ఇంగ్లాండ్‌ నుంచి భారత్‌కు లక్ష కిలోల బంగారం.. ఎందుకు ?

by Hajipasha |
ఇంగ్లాండ్‌ నుంచి భారత్‌కు లక్ష కిలోల బంగారం.. ఎందుకు ?
X

దిశ, నేషనల్ బ్యూరో : 1990వ దశకంలో మన దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆ టైంలో బ్యాంక్ ఆఫ్‌ ఇంగ్లండ్‌ నుంచి అప్పులు తీసుకునేందుకు భారత్ పెద్దఎత్తున బంగారాన్ని తనఖా పెట్టింది. ఆనాడు తనఖా కోసం లండన్‌కు పంపిన భారత బంగారం నిల్వలలో దాదాపు 100 టన్నుల (లక్ష కిలోల) పసిడిని ఆర్‌బీఐ తిరిగి తీసుకొచ్చింది. రవాణా, నిల్వ సర్దుబాట్లలో భాగంగా భారత్ ఇంతమొత్తం బంగారాన్ని తీసుకొచ్చింది. ఈ బంగారాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు తొలుత ఆర్థికశాఖ నుంచి ఆర్‌బీఐ కస్టమ్స్‌ సుంకం మినహాయింపు తీసుకుంది. సాధారణంగా అన్ని దిగుమతులపై వర్తించే ఐజీఎస్టీ మాత్రం తప్పలేదు. తద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా పంచుకోవాల్సి ఉండటమే దీనికి కారణం.

ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని భారత్‌కు తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఉపయోగించారు. పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. తాజా తరలింపుతో ఆర్‌బీఐ నిర్వహణ వ్యయాలు స్వల్ప స్థాయిలో తగ్గుతాయి. ఇప్పటి వరకు బంగారం నిల్వ చేసినందుకు బ్యాంక్‌ ఆఫ్ ఇంగ్లాండ్‌కు చెల్లిస్తూ వచ్చిన రుసుము ఇకపై చెల్లించనక్కరలేదు. మన దేశంలోని ముంబై మింట్‌ రోడ్డు, నాగ్‌పుర్‌లోని ఆర్‌బీఐ పాత కార్యాలయాల్లో ప్రభుత్వ బంగారాన్ని నిల్వ చేస్తుంటారు. గత కొన్నేళ్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్దఎత్తున బంగారాన్ని కొంటోంది. మరోవైపు విదేశాల్లోని మన బంగారం నిల్వలు గణనీయంగా పెరిగాయి. దీంతో కొంత మొత్తాన్ని భారత్‌కు తిరిగి తీసుకురావాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. 2024 మార్చి చివరి నాటికి ఆర్‌బీఐ వద్ద 822.1 టన్నుల బంగారం నిల్వ ఉంది. దీంట్లో 413.8 టన్నుల బంగారాన్ని ఇతర దేశాల్లో నిల్వ చేసి ఉంచింది.

Advertisement

Next Story