ఆదిత్య థాక్రే, సంజయ్‌ రౌత్‌ సన్నిహితుల ఇళ్లలో ఈడీ రైడ్స్..

by Vinod kumar |
ఆదిత్య థాక్రే, సంజయ్‌ రౌత్‌ సన్నిహితుల ఇళ్లలో ఈడీ రైడ్స్..
X

ముంబై : కరోనా సంక్షోభం సమయంలో మహారాష్ట్రలో ఫీల్డ్‌ ఆస్పత్రుల కేటాయింపులో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) నిర్వహించిన రైడ్స్ రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. ముంబైలోని ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ జైస్వాల్‌, శివసేన (ఉద్ధవ్) పార్టీ నేత ఆదిత్య థాక్రేకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సూరజ్‌ చవాన్‌, శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్‌ రౌత్‌ మిత్రుడు సుజిత్‌ పాట్కర్ ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారు.

కరోనా ఫీల్డ్‌ ఆస్పత్రుల కుంభకోణంలో మనీలాండరింగ్‌ జరిగిందనే అనుమానంతో ఈడీ ఈ రైడ్స్ నిర్వహించింది. ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ జైస్వాల్‌ గతంలో థానే నగర కమిషనర్‌గా, కరోనా సంక్షోభ సమయంలో ముంబై డిప్యూటీ కమిషనర్‌‌గా బాధ్యతలు నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించి ముంబై మున్సిపల్ కమిషనర్‌ ఇక్బాల్‌ సింగ్‌ చాహల్‌ వాంగ్మూలాన్ని జనవరిలో ఈడీ రికార్డు చేసింది.

సుజిత్‌ పాట్కర్ పై గతంలోనే ఈడీ మనీలాండరింగ్‌ అభియోగాలను నమోదు చేసింది. హెల్త్‌కేర్‌ రంగంలో ఎటువంటి అనుభవం లేకపోయినా కొవిడ్‌ సమయంలో సుజిత్‌ పాట్కర్ కే ఫీల్డ్‌ ఆస్పత్రి కాంట్రాక్టు దక్కింది. దీనిపై గతేడాది బీజేపీ నేత కీర్తి సొమయ్య ఆజాద్‌ మైదాన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. దీని ఆధారంగా లైఫ్‌లైన్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌, సుజిత్‌ పాట్కర్, అతడి ముగ్గురు సన్నిహితులపై ఈడీ కేసులు నమోదు చేసింది. తప్పుడు విధానంలో వీరు ఫీల్డ్‌ ఆస్పత్రుల కాంట్రాక్టులను దక్కించుకున్నారనే అభియోగాలను నమోదు చేశారు. ఇప్పుడు దీనిపైనే ఈడీ దర్యాప్తు జ‌రుపుతోంది.

Advertisement

Next Story

Most Viewed