Pm modi: భారత్ అందరి సంక్షేమం కోసం ఆలోచిస్తోంది.. ప్రధాని నరేంద్ర మోడీ

by vinod kumar |
Pm modi: భారత్ అందరి సంక్షేమం కోసం ఆలోచిస్తోంది.. ప్రధాని నరేంద్ర మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుత భారతదేశం అందరి అభివృద్ధి గురించి ఆలోచిస్తుందని, అన్ని దేశాలతోనూ సమాన సాన్నిహిత్యాన్ని కోరుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ నొక్కి చెప్పారు. భారత్‌ను ఒక సోదరుడిగా ప్రపంచం గౌరవిస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నట్టు తెలిపారు. రెండు రోజుల పోలాండ్ పర్యటనలో భాగంగా మోడీ బుధవారం ఆ దేశానికి చేరుకున్నారు. అనంతరం వార్సాలో ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. భారత్ ప్రతి దేశంతోనూ సమాన భాగస్వామ్యాన్ని కోరుకుంటుందని చెప్పారు. అన్ని దేశాల సమస్యలపై మాట్లాడుతుందని చెప్పారు. భారత్ సనాతన విలువలకు పోలాండ్‌ భాగస్వామి అని తెలిపారు.

రెండు దశాబ్దాల క్రితం ఘోరమైన భూకంపం సంభవించినప్పుడు గుజరాత్‌కు సహాయం చేసిన మొదటి దేశాల్లో పోలాండ్ కూడా ఒకటని గుర్తు చేశారు. భారత్, పోలాండ్ సమాజాల మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయన్నారు. ‘మానవాళికి ముప్పు తెచ్చే సవాళ్లను ఎదుర్కోవాల్సిన సమయం ఇది. అందుకే భారత్ దౌత్యానికి పెద్దపీట వేస్తోంది. యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న పిల్లలకు పోలాండ్ సహాయం చేయడాన్ని ప్రపంచం మొత్తం చూసింది. పోలాండ్ ప్రభుత్వం భారతీయ విద్యార్థులకు వీసా వంటి నిబంధనలను కూడా తొలగించింది’ అని వ్యాఖ్యానించారు. అంతకుముందు పోలాండ్ చేరుకున్న మోడీకి వార్సాలో ఘన స్వాగతం లభించింది. దీంతో అక్కడి ప్రజలకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తైన సందర్భంగా మోడీ పర్యటన జరుగుతుండటం గమనార్హం. అలాగే గత 45ఏళ్లలో భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. 1979లో చివరిసారిగా అప్పటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్‌ పోలాండ్‌ వెళ్లారు. తన పర్యటనలో భాగంగా మోడీ ఆ దేశ అధ్యక్షుడు, ప్రధానితో భేటీ కానున్నారు. పోలాండ్ పర్యటన అనంతరం మోడీ ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మోడీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story

Most Viewed