18-21 ఏళ్ల లివ్-ఇన్ రిలేషన్ జంటల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి

by S Gopi |
18-21 ఏళ్ల లివ్-ఇన్ రిలేషన్ జంటల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) కోసం ఏర్పాటు చేసిన ప్యానెల్ కీలక ప్రతిపాదనలు చేసింది. ప్యానెల్ నిబంధనల ప్రకారం, లింగ్ ఇన్ రిలేషన్ జంటలు అందించిన డేటా సురక్షితంగా ఉండేలా చూడటమే కాకుండా 18-21 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారి గురించి సమాచారాన్ని వారి తల్లిదండ్రులకు అందించాలని భావిస్తున్నట్టు కమిటీ చీఫ్ శుక్రవారం తెలిపారు. యూసీసీ ఆమోదం ద్వారా లివింగ్-ఇన్ రిలేషన్‌షిప్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్‌లను తప్పనిసరి చేసింది. శుక్రవారం జస్టిస్(రిటైర్డ్) రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ తమ నివేదికను సమర్పించింది. రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ప్యానెల్ 2022, మే 27న ఏర్పాటైంది. ఇది వివిధ మాధ్యమాల ద్వారా 2.33 లక్షల మంది నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 2న కమిటీ తన నివేదికను సమర్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ అసెంబీలో యూసీసీ ఆమోదం పొందడం ద్వారా స్వాతంత్య్రానంతరం దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. యూసీసీ అమలు కోసం ఏర్పాటైన ప్యానెల్ వివాహం, లివింగ్-ఇన్ రిలేషన్ రిజిస్ట్రేషన్ కోసం నమోదు చేసుకునే సమయంలో వారు అందించే డేటా గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లదని జస్టిస్ దేశాయ్ విలేకరుల సమావేశంలో చెప్పారు. తల్లిదండ్రులకు తెలియడం గోప్యతకు భంగం కదా అని అడిగిన ప్రశ్నకు.. ఇది చర్చించాల్సి ఉందన్నారు. 21 ఏళ్లు దాటిన లివింగ్-ఇన్ రిలేషన్‌షిప్ జంటల డేటా పూర్తిగా భద్రంగా ఉంటుంది. కానీ 18-21 మధ్య వయసు ఉన్న వారి భద్రత కోసం కమిటీ తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని భావిస్తోందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story