Biswa sarma: 2.5 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు.. అసోం సీఎం బిస్వ శర్మ

by vinod kumar |
Biswa sarma: 2.5 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు.. అసోం సీఎం బిస్వ శర్మ
X

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రంలోని మొత్తం జనాభాలో కనీసం 70 శాతం మందికి పోషకాహారం అందించేందుకు అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలను జాతీయ ఆహార భద్రతా చట్టం(ఎన్ఎఫ్ఎస్ఏ) పరిధిలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వశర్మ ఆదివారం వెల్లడించారు. ఈ ఏడాది నవంబర్ నాటికి ఎన్ఎస్ఎఫ్ఏలో కొత్త లబ్దిదారులను చేర్చే ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ‘అసోంలోని 2.5 కోట్ల మందికి పైగా ప్రజలకు ఆహార భద్రతను నిర్ధారించడం, జనాభాలో 70 శాతం మందికి పైగా ప్రజలకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం కీలకంగా పని చేస్తోంది’ అని తెలిపారు.

ఈ ఏడాది జనవరిలో 42 లక్షల మందికి పైగా కొత్త లబ్ధిదారులను చేర్చుకున్నామని, దీంతో మొత్తం సంఖ్య 2.31 కోట్లకు చేరుకోగా, వారిలో 98 శాతం మంది ప్రతి నెల ఉచిత ఆహారధాన్యాలను పొందుతున్నారని చెప్పారు. మిగిలిన వారిని ఎన్ఎస్ఎఫ్ఏ పరిధిలోకి తీసుకురావడానికి ఓ కార్యక్రమాన్ని ప్రారంభించామని స్పష్టం చేశారు. గతంలో ఎన్‌ఆర్‌సీ బయోమెట్రిక్ లాక్, ఆధార్ కార్డ్ లేని కారణంగా మినహాయించబడిన వ్యక్తులను కూడా ప్రస్తుతం పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఈ చొరవ పేద ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ప్రతి పౌరునికీ పౌష్టికాహారం అందుబాటులోకి తీసుకురావాలని, తద్వారా అందరికీ ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని బిస్వశర్మ తెలిపారు.

Advertisement

Next Story