భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ ఇంట్లో విషాదం..

by vinod kumar |
milkha singh wife
X

దిశ, వెబ్‌డెస్క్: భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ సతీమణి నిర్మల కౌర్ (85) కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆమెకు చండీగఢ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె కరోనాతో పోరాడుతూ ఆదివారం సాయంత్రం 4 గంటలకు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మిల్కా సింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నిర్మల కౌర్ పంజాబ్‌ ప్రభుత్వంలో మహిళా స్పోర్ట్స్‌ డైరెక్టర్‌గా పని చేశారు. అంతేకాకుండా భారత మహిళల వాలీబాల్‌ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. నిర్మల కౌర్ మృతిపట్ల పలువురు ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. క్రీడా రంగంలో ఆమె చేసిన సేవలు మరవలేనివి అని పేర్కొన్నారు. మరోవైపు మిల్కా సింగ్‌ సైతం కరోనాతో నిర్మల చేరిన ఆసుపత్రిలోనే చికిత్సపొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఐసీయూ లో ఉన్న కారణాన భార్య అంత్యక్రియలకు కూడా హాజరుకాలేకపోతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Next Story