- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నె(సె)ట్ లేకుండా నెట్టేద్దామనుకున్నారా..?!

విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఆచార్యుల నియామకాలు, ప్రమోషన్స్ కోసం కనీస అర్హతలు, ప్రస్తుతం ఉన్నత విద్యలో ప్రమాణాల నిర్వహణ పేరుతో యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలు - 2025ను, జనవరి 6న, ఒక డ్రాఫ్ట్ రూపంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ విడుదల చేసింది. దీనిపై ఫిబ్రవరి 5 నాటికి ప్రజాభిప్రాయం తీసుకుని, నూతన మార్గదర్శకాలను తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఈ యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలు 2025ను పరిశీలిస్తే, అందులో వీసీలు, సహాయ ఆచార్యుల నియామకాల విధానం భావి భారత డిగ్రీ, పీజీ, విశ్వవిద్యాలయాల విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టే విధంగా ఉన్నది. నెట్ అవసరం లేకుండా మాస్టర్స్ ఉంటే చాలు అనే విషయం జీర్ణం చేసుకోలేం. ఈ మధ్య కాంట్రాక్ట్ లెక్చరర్స్ను పెర్మనెంట్ చేసే క్రమంలో వెలుగు చూసిన నకిలీ సర్టిఫికెట్స్ల విషయం తలుచుకుంటే వెన్నులో జలదరింపు కలగక మానదు. ఈ పరిస్థితుల్లో ఇలాంటి వారు ఒకవేళ యూనివర్సిటీలలో డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలలో లొసుగులను ఆసరా చేసుకుని ప్రవేశిస్తే విద్యార్థుల భవిష్యత్ ఏమిటి అనేది వెయ్యి మిలియన్ల ప్రశ్న.
భారత ప్రభుత్వంలోని ఉన్నత విద్యా మంత్రిత్వశాఖ ద్వారా 1956లో ఏర్పాటు చేయబడిన ఒక చట్టబద్ధమైన స్వతంత్ర సంస్థ యూజీసి. ఇది ఉన్నత విద్యా ప్రమాణాలు, సమన్వయం, నిర్ణయం, నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తుంది. ఇది దేశంలోని డిగ్రీ కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు గుర్తింపును, న్యాక్ గ్రేడ్ ను, 12బి గుర్తింపును ఇస్తుంది. ఈ గుర్తింపు పొందిన డిగ్రీ కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు నిధుల పంపిణీ చేస్తుంది. ఇది విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో బోధించే అధ్యాపకుల అర్హతలు ఏమి ఉండాలి అని నిర్ణయిస్తుంది. యూజీసీ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నియమ నిబంధనలు మారుస్తూ ఉంటుంది. అదే విధంగా ప్రొఫెసర్స్ జీతభత్యాలను సవరిస్తుంది.
భవిష్యత్ను అంధకారంలో నెట్టే విధంగా..
ఈ యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలు 2025 ను పరిశీలిస్తే అందులో వీసీలు, సహాయ ఆచార్యుల నియామకాల విధానం భావి భారత డిగ్రీ ,పీజీ, విశ్వవిద్యాలయాల విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టే విధంగా ఉన్నది. ప్రస్తుతం అమలులో ఉన్న 2018 నాటి నిబంధనల ప్రకారం పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చదివిన సబ్జెక్ట్, అదే సబ్జెక్టులో నెట్లో ఉత్తీర్ణత సాధిస్తే వారు డిగ్రీ , పీజీ కాలేజీ విశ్వవిద్యాలయాలలో సహాయ ఆచార్యులుగా అర్హులు అని పేర్కొన్నది. ఇది ఉన్నతమైన, ఉత్తమమైన నిర్ణయంగా మేధావులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే CSIR లేదా యూజీసీ నెట్ అనే పరీక్ష సంవత్సరంలో రెండు దఫాలు నిర్వహిస్తారు. దీని ఫలితాల విధానం పరిశీలిస్తే CSIR NET జూలై, 2024 పరీక్షకు 2,25,335 అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా 1,63,529 అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందులో జేఆర్ఎఫ్కు అర్హత సాధించిన వారు 1,875 మంది, సహాయ ఆచార్యులుగా అర్హత సాధించిన వారు 3,172 మంది. అదేవిధంగా యూజీసీ నెట్ జూన్ 2024 పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకున్నవారు 11,21,225 మంది , పరీక్షకు హాజరైన వారు 6,84,224 మంది, ఎందులో JRF కు అర్హత సాధించిన వారు 4,970 మంది, సహాయ ఆచార్యులుగా అర్హత సాధించిన వారు 53,694 మంది అభ్యర్థులు. అదే విధంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సెట్ పరీక్ష తీరుతెన్నులు చూస్తే తెలంగాణ సెట్, 2024 పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నవారు 33,494, ఇందులో 26,294 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనారు, ఇందులో 1,884(7.17%) మాత్రమే అర్హత సాధించారు.
పై సమాచారం అవగాహన చేసుకుంటే నెట్, సెట్లలో అర్హత సాధించటం అంత సులువైన విషయం కాదు. ఈ పరీక్షలో సంబంధిత విషయాలపై లోతైన అవగాహన అభ్యర్థులకు ఉందా? ప్రస్తుత పరిస్థితులకు విషయాలను(సబ్జెక్ట్) ఎలా అనుసంధానిస్తున్నారు అని లోతుగా పరీక్షించే విధంగా ప్రశ్నల సరళి ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారు, పీహెచ్డీ చేసిన వారు డిగ్రీ, పీజీ కళాశాలలో, ఇంజనీరింగ్ కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యులుగా ఉంటే ఉన్నతంగా, ఉత్తమంగా విషయాల బోధన, పరిశోధన జరుగుతుంది. దీని ఫలితంగా యూనివర్సిటీలలో బోధన ఫలవంతంగా సాగుతుంది. భవిష్యత్ తరాలు ప్రపంచంతో పోటీ పడి ముందు వరుసలో ఉంటాయి.
సమాజ శ్రేయస్సును ఆలోచించి..
ప్రస్తుత యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలు - 2025లో నెట్ అవసరం లేకుండా మాస్టర్స్ ఉంటే చాలు అనే విషయం జీర్ణం చేసుకోవడానికే కష్టంగా ఉంది. ఎందుకంటే యూనివర్సిటీలు పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రవేశాలు చేపడుతున్నాయి. కానీ ఆ విధానంతో ప్రైవేట్ కళాశాలలో ప్రవేశం పొందిన వారు ఏ విధంగా విద్యను పొందుతున్నారో, పట్టాల ప్రదానం జరుగుతుందో జగత్ విదితమే. నేడు దేశవ్యాప్తంగా ప్రైవేట్ యూనివర్సిటీల ప్రవేశం అభినందనీయం. కానీ వాటిలో కొన్ని యూనివర్సిటీల నుండి పీజీ పట్టాలు తీసుకున్న అభ్యర్థులకు, నేర్చుకున్న విషయాలపై కనీస అవగాహన లేదని, చాలా మంది మేధావులు బహిరంగంగానే చెబుతున్నారు. అదేవిధంగా ఎంఈ/ఎంటెక్ చేసిన వారికి సంబంధిత సబ్జెక్ట్లో ఎంతమేర విషయ అవగాహన ఉందో ప్రశ్నార్థకమే. భావి భారతానికి బంగారు బాటలు విశ్వవిద్యాలయాల్లో పడుతాయి కావున, యూజీసీ ఎవరి ప్రభావాలకు లోనుకాకుండా సమాజ శ్రేయస్సును ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని భారత దేశ ప్రగతిలో క్రియాశీలక పాత్ర పోషిస్తారని ఆశిద్దాం. "విద్యే ప్రపంచాన్ని మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధం". అని నెల్సన్ మండేలా అన్నాడు. అది నాణ్యమైన విద్యతోనే సాధ్యం. కావున నాణ్యమైన విద్యను ప్రోత్సహించేలా యూజీసీ నిర్ణయాలు ఉన్నతంగా ఉత్తమంగా అందరూ మన్ననలు పొందేలా ఉండాలని కోరుకుందాం.
మహేశ్వరం భాగ్యలక్ష్మి,
అసిస్టెంట్ ప్రొఫెసర్,
95056 18252