చికిత్స కోసం వెళ్లి.. వైద్యుడిపై దారుణం

by Y.Nagarani |
చికిత్స కోసం వెళ్లి.. వైద్యుడిపై దారుణం
X

దిశ, వెబ్ డెస్క్: దేశరాజధాని ఢిల్లీలోని జైత్ పూర్ లో ఉన్న ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్ లో వైద్యుడిపై దుండగులు దారుణానికి పాల్పడ్డారు. తమకు గాయాలయ్యాయని, చికిత్స చేయాలని వైద్యుడిని కోరగా.. అతను టీట్మెంట్ చేశాడు. అనంతరం దుండగులు ఆ వైద్యుడిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు గాయాలతో గత అర్థరాత్రి నిమా ఆస్పత్రికి వెళ్లారు. తమకు డ్రెస్సింగ్ చేయాలని అడగగా నర్స్ వారికి డ్రెస్సింగ్ చేసింది. డ్రెస్సింగ్ పూర్తయ్యాక.. యువకులు తమకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కావాలని, ఆయనను ఒకసారి కలవాలని చెప్పి క్యాబిన్ కు వెళ్లారు. ప్రాక్టీషనర్ డాక్టర్ జావేద్ అక్తర్ (55)పై కాల్పులు జరిపారు. గన్ ఫైర్ అయిన శబ్దం విన్న ఆస్పత్రి సిబ్బంది వెంటనే క్యాబిన్ కు వెళ్లి చూడగా.. డాక్టర్ తలపై బుల్లెట్ గాయమై తీవ్ర రక్తస్రావంతో మరణించారు.

డాక్టర్లకు రక్షణ కల్పించాలని కోల్ కతాలో వైద్యులు ఆందోళన చేస్తున్న వేళ.. ఢిల్లీలో వైద్యుడి హత్య జరగడం సంచలనం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైద్యుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంది.

Next Story

Most Viewed