పురుగుల మందు తాగిన బాలిక చికిత్స పొందుతూ మృతి..

by Kalyani |   ( Updated:2024-10-24 11:36:49.0  )
పురుగుల మందు తాగిన బాలిక చికిత్స పొందుతూ మృతి..
X

దిశ,గద్వాల్ క్రైం : గద్వాలలోని ఓ సీడ్ ఆర్గనైజర్ ఇంట్లో పని చేస్తున్న మైనర్ బాలిక (17) పై బంగారు దొంగిలించిందని నింద వేయడంతో అవమానభారంతో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేయగా… గత కొన్ని రోజులుగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. రెండు నెలల క్రితం సీడ్ ఆర్గనైజర్ ఇంట్లో బంగారు కనిపియ కపోవడంతో జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పోలీస్ స్టేషన్ లో సీడ్ ఆర్గనైజర్ రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆ బాలిక ని బిజ్వారం గ్రామం నుంచి స్టేషన్ కు రప్పించి విచారణ చేశారు. ఈ క్రమంలో తాను బంగారం చోరీ చేయలేదని తెలిపింది. ఈ సంఘటన నేపథ్యంలో అవమానకరంగా భావించి ఆ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

దీంతో ఆ బాలికని సమీపంలోని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించగా… పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారి దగ్గర సరైన ఆర్థిక స్తోమత లేక ఐదు రోజులు అనంతరం అక్కడ నుంచి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. గత వారం రోజులుగా బాలికకు చికిత్స అందిస్తున్నా ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో నేడు చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషయం పై సీఐ టంగుటూరిని వివరణ కోరగా బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం విషయం మా దృష్టికి వచ్చిందని తెలిపారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో బాలిక అపస్మారక స్థితిలో ఉండగా వారి తల్లి వాంగ్మూలాన్ని రికార్డ్ చేశామని, ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి కారకులపై చర్యలు తీసుకుంటామన్నారు. 17 ఏళ్ల బాలికను పనిలో వెట్టి చేయించడం బాధాకరమని అన్నారు. బంగారు చోరి నింద మోపి మా బాలిక మృతికి కారణమైన రాజశేఖర్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకొని, న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Advertisement

Next Story