ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7 శాతం: ఆర్‌బీఐ

by Harish |
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7 శాతం: ఆర్‌బీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతం వృద్ధి చెందుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం విడుదల చేసిన నివేదిక పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో కూడా భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్దిని కనబరిచింది. వాస్తవ జీడీపీ వృద్ధి అంతకుముందు ఏడాది 7.0 శాతం నుంచి ఎఫ్‌వై 24లో 7.6 శాతానికి పెరిగింది. ఇది వరుసగా గత మూడు సంవత్సరాలుగా 7శాతం కంటే ఎక్కువగానే నమోదవుతుందని ఆర్‌బీఐ తెలిపింది. ఆర్థిక వ్యవస్థకు ఎదురుగాలులు తాకినప్పటికి కూడా 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా దేశం మంచి స్థితిస్థాపకతను ప్రదర్శించిందని పేర్కొంది.

వచ్చే దశాబ్దంలో భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో దూసుకుపోతుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. ప్రస్తుతం బ్యాంకులు, కార్పొరేట్ ఆదాయాలు, ఆరోగ్యకరమైన బ్యాలెన్స్ షీట్‌లు మెరుగ్గా ఉండటం, మూలధనం వ్యయం, ద్రవ్య, నియంత్రణ, ఆర్థిక విధానాలపై ప్రభుత్వం దృష్టి సారించడం ద్వారా దేశంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఏర్పడిన నేపథ్యంలో భారత జీడీపీ వృద్ధి బలంగా ఉందని ఆర్‌బీఐ తెలిపింది. ప్రధానంగా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుండటంతో ఇది గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ డిమాండ్‌ను పెంచుతుందని నివేదిక పేర్కొంది.

విదేశీ మారక నిల్వలు రూపంలో బయటి నుంచి కూడా దేశీయ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుంది. ప్రపంచ మార్కెట్లో భౌగోళిక అస్థిర పరిస్థితులు, అంతర్జాతీయ వస్తువుల ధరల కదలికలు, వృద్ధి దృక్పథానికి ప్రతికూల ప్రమాదాలను కలిగిస్తాయని నివేదిక జోడించింది. కానీ దేశీయంగా ఉన్న సానుకూలతల కారణంగా భారత్ ఈ అవరోధాలను విజయవంతంగా దాటుకుంటుందని ఆర్‌బీఐ పేర్కొంది.

భారత్ తన జనాభా డివిడెండ్‌ను ఉపయోగించుకోవడం, పోటీతత్వ ప్రయోజనాలను ఎక్కువగా సద్వినియోగం చేసుకోవడం వల్ల వచ్చే దశాబ్దంలో బలమైన వృద్ధి చూపిస్తుందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలను వేగంగా స్వీకరించడం, వాతావరణ మార్పుల వల్ల తలెత్తే కొన్ని సవాళ్లను భారత ఆర్థిక వ్యవస్థ నావిగేట్ చేయవలసి ఉంటుందని, రాబోయే దశాబ్దంలో బలమైన వృద్ధికి సిద్ధంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది .

Advertisement

Next Story