ప్రధాని మోడీ సర్కారుపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

by srinivas |
ప్రధాని మోడీ సర్కారుపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ సర్కార్‌పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్ జలగల రిమోట్ కంట్రోల్‌తో ఈ ప్రభుత్వం నడుస్తోందని ఆమె విమర్శించారు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన షర్మిల ‘‘నాడు, బ్రిటిష్ వారిపై నిస్వార్థంగా పోరాడి, స్వేచ్ఛయే లక్ష్యంగా అలుపెరగని సుదీర్ఘ సమరం చేసి, దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, ఈరోజు, మరోసారి, ప్రజాధనాన్ని లూటీ చేస్తూ, ప్రజల ఆస్తులను విచక్షణారహితంగా దోచుకుంటున్న కార్పొరేట్ జలగలు, వారి చేతిలోనున్న రిమోట్ కంట్రోల్‌తో నడుస్తున్న మోడీ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ మరొక పోరాటం సాగిస్తోందని పోరాటం పేర్కొన్నారు.

‘సెబీ చీఫ్ మాధబి పూరీపై వచ్చిన తీవ్ర ఆరోపణలపై విచారణ జరపకుండా, అదానీ పెట్టుబడులకు సంబంధించి ఆమె పాత్ర గురించి యావత్ దేశం నిరసన తెలుపుతున్న వేళ, నిమ్మకు నీరెత్తకుండా, మౌనం వహిస్తూ, పైపెచ్చు అటు ఆమెను, ఇటు అదానిని కాపాడే కుటిల ప్రయత్నాలను చేస్తున్న మోదీ సర్కారు దివాళాకోరుతనాన్ని నిరసిస్తూ, INDIA కూటమి నేడు దేశవ్యాప్తంగా ED ఆఫీసుల ఎదుట ధర్నాలు నిర్వహిస్తోంది.’ అని షర్మిల ఆరోపించారు.

‘దేశంలోని 10 కోట్ల మంది పెట్టుబడిదారుల ఆందోళనను ఏమాత్రం పట్టించుకోకుండా, నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తున్న బీజేపీ సర్కారును నిలదీస్తూ, మాదబీ పూరి విషయంలో వెనువెంటనే JPC వేసి, సిబిఐ, ఈడీ సమగ్ర విచారణకు ఆదేశించాలి.’ అని షర్మిల డిమాండ్ చేశారు.

‘ఇటువంటి క్యాపిటలిస్టు రక్కసి ధోరణిని ప్రజలపై రుద్దుతూ, ప్రభుత్వ సంస్థలను తన జేబు సంస్థలుగా మార్చుకున్నారని షర్మిల వ్యాఖ్యానించారు. కేవలం ప్రతిపక్షాల మీద కక్షపూరిత దాడులకు మాత్రమే వాటిని వాడుకుంటున్నారని ఆరోపించారు. మోదీ నియంత పాలనపై కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుందని చెప్పారు. అదానీ లాభాలు మోదీ లాభాలుగా, అదానీ సంస్థల వృద్ధి, బీజేపీ వృద్ధిగా మారిన దారుణ పరిస్థితుల్లోకి దేశాన్ని నెట్టేశారని మోడీని షర్మిల విమర్శించారు.

దీనిపై దర్యాప్తు ప్రారంభించడం ప్రభుత్వానికి నైతిక, వృత్తిపరమైన బాధ్యత ఉందన్నారు. ఇంత తీవ్రమైన ఆరోపణపై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. కార్పొరేట్ మిత్రులను కాపాడటానికి అన్ని కుటిల మార్గాలను వాడుకోవటం ఎంతో సిగ్గుచేటని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed