YS Jagan vs Sharmila: షర్మిల పెట్టే ప్రెస్‌మీట్లలో 95 శాతం జగన్‌ను తిట్టడానికే: వైసీపీ ఎంపీ విజయసాయి

by karthikeya |
YS Jagan vs Sharmila: షర్మిల పెట్టే ప్రెస్‌మీట్లలో 95 శాతం జగన్‌ను తిట్టడానికే: వైసీపీ ఎంపీ విజయసాయి
X

దిశ, వెబ్‌డెస్క్: తల్లికి, చెల్లికి అన్యాయం చేశాడనడం షర్మిలకు చంద్రబాబు ఇచ్చిన అజెండా అని, అదే షర్మిల అమలు చేస్తున్నారనడంలో ఎవ్వరికీ సందేహం లేదని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఆదివారం నాడు ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన.. షర్మిల పెట్టే ప్రెస్‌మీట్లలో 95 శాతం జగన్‌ను తిట్టడానికే పెడుతున్నారని, జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు నవరత్నాల ద్వారా అక్కచెల్లెమ్మలకు, అమ్మలకు వేల కోట్లు అందించారని చెప్పిన విజయసాయి.. దాని వల్ల మహిళల్లో ఆయనకు ఎనలేని అదరాభిమానాలున్నాయని, ఆ అభిమానాన్ని దెబ్బతీసి ఆయనపై వ్యతిరేకత పెండానికే చంద్రబాబు షర్మిలను వాడుకుంటున్నాడని ఆరోపించారు.

‘‘తల్లికి, చెల్లికి అన్యాయం చేసినవాడు రాష్ట్రంలో మహిళలకు ఏం న్యాయం చేస్తాడనే ఓ తప్పుడు అజెండాని ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. అందుకు షర్మిలను పావుగా ఉపయోగించుకుంటోంది. జగన్‌ మళ్లీ సీఎం కాకుండా అడ్డుకోవాలని కుట్రపన్నుతున్నారు. కానీ మీ అజెండాను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబుతో షర్మిల లాలూచీ పడ్డారు. అన్న జగన్ రాసిన లేఖ చంద్రబాబు చేతికి ఎలా చేరింది? జగన్‌కు షర్మిల తీరని ద్రోహం చేస్తున్నారు. జగన్ తన తెలివి తేటలతో ఆస్తులు వృద్ధి చేశారు. అలా వృద్ధి చేసిన ఆస్తుల్లో షర్మిల వాటా అడుగుతున్నారు. అదే నష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడైనా షర్మిల షేర్ చేసుకున్నారా..? జగన్ అతి మంచితనం వల్లే ఈ అనర్థాలు వచ్చాయి. చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటాం. మళ్లీ అరెస్ట్‌లు కూడా చేయొచ్చు.. భయపడేది లేదు’’ అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి (YS Jagan), ఆయన చెల్లెలు షర్మిల (Sharmila) మధ్య ఆస్తి తగాదా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం నేపథ్యంలోనే ఒకపక్క కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల ప్రెస్‌మీట్‌లు పెట్టి తన అన్న తనకు ఆస్తి ఇవ్వడం లేదని ఆరోపిస్తుంటే.. మరో పక్క వైసీపీ నేతలు జగన్‌కు మద్దతుగా షర్మిలకు కౌంటర్లిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా రంగంలోకి దిగి షర్మిలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed