Breaking: దారుణం.. ప్రాణం తీసిన పెన్షన్

by Disha Web Desk 16 |
Breaking: దారుణం.. ప్రాణం తీసిన పెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పెన్షన్ డబ్బులు కోసం వృద్ధులు ప్రాణం పోగొట్టుకుంటున్నారు. లబ్ధిదారులకు నగదు పంపిణీ వ్యవహారంలో వార్డు వాలంటీర్లను వినియోగించొద్దని ఎన్నికల సంఘం ఆంక్షలు విధించడంతో అవ్వాతాతలకు కష్టాలు మొదలయ్యాయి. గతంలో ఇంటి వద్దనే పింఛన్లు అందుకునేవారు. ఈసీ ఆంక్షలతో గత నెలలో గ్రామ సచివాలయాల వద్ద పింఛన్లు తీసుకున్నారు. ఈ నెల పింఛన్ డబ్బులను ప్రభుత్వం బ్యాంకుల్లో జమ చేసింది. దీంతో వృద్ధులు బ్యాంకుల వద్ద పడి గాపులు కాస్తున్నారు. గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడి పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారు.

అయితే చాలా బ్యాంకుల వద్ద సరైన సౌకర్యాలు లేక వృద్ధులు, వికలాంగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల వృద్ధులు మృతి చెందుతున్నారు. గత నెలలో వృద్ధులు మృతులు చెందిన విషయం తెలిసిందే. ఈ నెలలోనూ వృద్ధులకు కష్టాల తప్పవని తెలిసినా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోలేదు. నిండు వేసవిలో నిండు ముసలివాళ్లను బలితీసుకుంటున్నారు. బ్యాంకుల వద్ద మంచినీళ్లు వంటి కనీస అవసరాలను కూడా తీర్చడం లేదు. దీంతో ఎండ తీవ్రతతో దాహంతో అల్లాడిపోతున్నారు. వృద్ధులయితే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళారంలో పింఛన్ తీసుకుందామని వెళ్లి వృద్ధులు సుబ్బన్న మృత్యువాత పడ్డారు. ఎండ తీవ్రతతో బ్యాంకు వద్దనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనంతరం ప్రాణాలు విడిచారు. బ్యాంకు అధికారులు కనీసం మంచి నీటి అవసరాలన్ని తీర్చినా నిండు ప్రాణం పోయి ఉండేది కాదని స్థానికులు అంటున్నారు. అంతేకాదు బ్యాంకు అధికారులు, ఉద్యోగులపై ఆగ్రహం చేస్తున్నారు. ఇప్పటికైనా బ్యాంకుల వద్ద కనీస అవసరాలు సమకూర్చాలని కోరుతున్నారు. వృద్ధుడి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు.

Next Story