విశాఖలో ‘దిశ’ పెను సంచలనం.. భారీ స్కామ్ వెలికితీతతో అలజడి

by srinivas |
విశాఖలో ‘దిశ’ పెను సంచలనం.. భారీ స్కామ్ వెలికితీతతో అలజడి
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ మధురవాడలోని ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డులో 9‌0 ఎకరాల స్కామ్‌ను ‘దిశ’ బయటపెట్టడంతో ఒక్కసారిగా అలజడి ప్రారంభమైంది. అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ చేయించుకొన్న వారు, చేసిన వారు, అందుకు సహకరించిన అధికారులు వణికిపోతున్నారు. వైఎస్‌ఆర్ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాలకు, మధ్య తరగతి వర్గాల గృహ నిర్మాణానికి కేటాయించిన భూములను విజయసాయి, కేఎన్‌ఆర్‌ల బృందం కొట్టేసి విల్లాలు, ఖరీదైన అపార్ట్మెంట్లు కట్టేసేందుకు సిద్ధం కావడంతో కూటమి ప్రభుత్వం వివరాలు సేకరిస్తోంది.

ఎన్సీసీ నుంచే విచారణ ..

నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి ఒక సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డ్ కేటాయించిన భూములను దుర్వినియోగం చేసిన తీరుపై వివరాలు రాబడుతున్నారు. ఎన్సీసీ నుంచే అవసరమైన డాక్యుమెంట్లు రాబట్టి దోషులను తేల్చే పనిని దర్యాప్తు సంస్ధలు ప్రారంభించాయి. కేటాయింపు జరిగిన తరవాత పదేళ్ల పాటు ఆ భూముల్లో తుప్పలు కూడా కొట్టని ఎన్సీసీ రాష్ర్టంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భూములపై పూర్తి అవగాహన వున్న సింగపూర్ రమణారెడ్డి అలియాస్ కుందూరు రమణారెడ్డిని రంగంలోకి దించింది.

హరిత ప్రాజెక్టును వదిలేసి..

ఈ భూములకు దగ్గరలోనే అప్పటి విశాఖ వుడా నుంచి హరిత ప్రాజెక్టును చేజిక్కించుకొన్న రమణారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించి మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు. అతికష్టం మీద వుడానే ఆ ప్రాజెక్టును కొన్ని సంవత్సరాల తరువాత పూర్తి చేసి డబ్బు చెల్లించిన లబ్ధిదారులకు అందజేసింది. విశాఖ వుడాలో వైఎస్ఆర్ పాలనా కాలంలో రమణారెడ్డి చేసిన భూ లావాదేవీలు ఏమీ పూర్తి కాలేదు. రాష్ట్ర అభివృద్ధికి సహాయపడలేదు.ఈ నేపథ్యంలో వేలాది కోట్ల రూపాయల విలువైన భూములను సింగపూర్ రమణారెడ్డి సూట్ కేస్ కంపెనీలను అడ్డుపెట్టుకొని వైఎస్ఆర్సిపిలో అగ్ర నాయకులు అన్యాక్రాంతం చేసినటువంటి వాస్తవాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తుండడంతో ఇప్పుడు రాష్ర్ట ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ గా దృష్టి సారించింది.

కేఎన్‌ఆర్ పాత్రపై ఆరా ..

ఈ పూర్తి వ్యవహారానికి పాత్రధారులు, సూత్రధారులుగా ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో పాటు మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ వ్యక్తి గత కార్యదర్శి కే నాగేశ్వర్ రెడ్డి (కేఎన్ఆర్) పాత్రపై ఆరా తీస్తున్నారు. ఎన్నికలకు ముందు కే.నాగేశ్వర్ రెడ్డి బినామీ కంపెనీలుగా చెబుతున్న ట్రైడెంట్, ఓక్సిలీ లకు భారీగా భూముల లావాదేవీలు జరిగాయి. ఎవరిపేరిట జరిగాయి? ఈ కంపెనీల డైరెక్టర్లు ఎవరూ? వారి ఆర్థిక పరిస్థితి ఏమిటీ? వంటి వివరాలను రాబడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని విశాఖలోని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోని ప్రజా అవసరాలకు వినియోగించాలనే డిమాండ్ మొదలైంది.

రమణమూర్తి, సుబ్బారావు ఎవరూ?

ఈ భూముల లావాదేవీల్లో పాల్గొన్న విజయనగరంలో పూరిపాకలో వుండే కొల్ల వెంకట రమణమూర్తి, విజయవాడ మధురానగర్‌‌కు చెందిన దొంగ సుబ్బారావు, ఓక్సిలీ డెవలపర్స్ ప్రతినిధి దండా బిందుమాధవి వివరాలను దర్యాప్తు సంస్థలు సేకరిస్తున్నాయి. వీరితో పాటు భూములు పొందిన విప్పల శాంతన్ రెడ్డి, విప్పల నరసారెడ్డిల ఆర్థిక స్థోమత ఏమిటీ? వీరికి కేఎన్ఆర్ కు ఉన్న సంబంధాలు ఏమిటీ అన్న వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed