ఆల్టర్నేట్ రోజుల్లో లోక్‌సభ సమావేశాలు

by  |
ఆల్టర్నేట్ రోజుల్లో లోక్‌సభ సమావేశాలు
X

న్యూఢిల్లీ: కరోనా కాలంలో పార్లమెంటు సమావేశాలను నిర్వహించడానికి అనేక ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ముందు జాగ్రత్తగా భౌతిక దూరాన్ని పాటించడం, చట్టసభ్యులందరికీ స్థల సర్దుబాటులాంటి విషయాలపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఎంపీలందరూ భౌతికంగా హాజరుకావడానికే వీరిరువురూ అంగీకరించినట్టు సమాచారం. దీనికోసం రాజ్యసభ, లోక్‌సభ చర్చలను షిఫ్టులు లేదా వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని నిర్ణయించారు.

లోక్‌సభలోని 542 మంది ఎంపీలు 168 మంది దిగువ సభ చాంబర్‌లో, మిగతావారూ రాజ్యసభ చాంబర్‌లో, అలాగే, రెండు సభల గ్యాలరీలలో ఆసీనులుకానున్నారు. రాజ్యసభ ఎంపీలూ రెండు చాంబర్‌లలో భౌతిక దూరాన్ని పాటిస్తూ కూర్చునే ప్లాన్ వేశారు. లోక్‌సభలో రెండు వరుసల మధ్య పాలికార్బొనేట్ సీట్లను ఏర్పాటు చేసి భౌతిక దూరం సమర్థంగా అమలయ్యే నిర్ణయం తీసుకున్నారు. అందరికీ సభా వివరాలు తెలిసేలా పెద్ద స్క్రీన్‌లను ఏర్పాటు చేసి ప్రతి సీటుకు మైక్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఓటింగ్ కోసం నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ప్రత్యేకంగా ఒక అప్లికేషన్‌ను అభివృద్ధి చేయనుంది. పార్లమెంటు సమావేశాలు వచ్చేనెల తొలినాళ్లలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.


Next Story

Most Viewed