IPL 2025 : కెప్టెన్సీపై కీలక ప్రకటన చేసిన రాజస్థాన్ రాయల్స్.. ఆ యువ క్రికెటర్‌కు పగ్గాలు

by Harish |
IPL 2025 : కెప్టెన్సీపై కీలక ప్రకటన చేసిన రాజస్థాన్ రాయల్స్.. ఆ యువ క్రికెటర్‌కు పగ్గాలు
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు భారత వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ సీజన్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు అతను నాయకత్వం వహించడం లేదు. యువ బ్యాటర్ రియాన్ పరాగ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని గురువారం ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో శాంసన్ వేలికి గాయమవ్వగా.. గత నెలలో సర్జరీ చేయించుకున్నాడు. కోలుకున్న అతను ఇటీవల రాజస్థాన్ జట్టులో చేరాడు.

అయితే, శాంసన్ ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించలేదు. దీంతో తొలి మూడు మ్యాచ్‌ల్లో రియాన్‌ పరాగ్‌కు జట్టు పగ్గాలు అప్పగించాడు. శాంసన్‌‌ కేవలం బ్యాటర్‌గానే ఆడనున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడే అవకాశం ఉంది. ‘నేను తొలి మూడు మ్యాచ్‌ల్లో పూర్తి స్థాయిలో బరిలోకి దిగలేను. జట్టులో నాయకత్వ లక్షణాలు కలిగిన వారు చాలా మంది ఉన్నారు. ఈ మూడు మ్యాచ్‌ల్లో రియాన్ పరాగ్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. అతనికి అందరూ మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నా.’అని శాంసన్ తెలిపాడు.

శాంసన్‌కు వికెట్ కీపింగ్, ఫీల్డింగ్ క్లియరెన్స్ రాలేదని, పూర్తి ఫిట్‌నెస్ సాధించాక కెప్టెన్సీ చేపడతాడని ఫ్రాంచైజీ తెలిపింది. శాంసన్ స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టే చాన్స్ ఉంది. గత సీజన్‌లో పరాగ్ 14 ఇన్నింగ్స్‌ల్లో 573 రన్స్‌తో సంచలన ప్రదర్శన చేశాడు. ఐపీఎల్‌లో రియాన్ తొలిసారిగా కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. ఈ నెల 23న రాజస్థాన్ తమ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌తో తలపడనుంది.


Next Story

Most Viewed