BREAKING: ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

by Satheesh |
BREAKING: ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. కుహక్‌మెట్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డట్లు సమాచారం. మావోయిస్టుల కాల్పుల్లో పలువురు జవాన్లు సైతం గాయపడ్డట్లు తెలుస్తోంది. ఘటన స్థలం నుండి భద్రతా దళాలు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా, కుహక్‌మెట్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలోనే భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడగా.. ఇరు వర్గాలు కాల్పులు చేసుకున్నాయి.

ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరికొందరు మావోయిస్టులు పారిపోవడంతో కుహక్‌మెట్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. కాగా, ఎన్ కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టులు ఎవరన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల ఛత్తీస్ గఢ్‌లో జరుగుతోన్న వరుస ఎన్ కౌంటర్లలో పెద్ద ఎత్తున మావోయిస్టులు మరణిస్తున్నారు. గడిచిన మూడు నెలల్లోనే దాదాపు 200 మంది మావోయిస్టులు ఎన్ కౌంటర్ హతమైనట్లు తెలుస్తోంది.

Next Story