ట్రంప్ ఆరోపణలపై అధికారుల కీలక ప్రకటన

by vinod kumar |
ట్రంప్ ఆరోపణలపై అధికారుల కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్కంఠంగా సాగిన అమెరికా ఎన్నికల ఫలితాల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఘన విజయం సాధించారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికైనప్పటి నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మింగుడుపడటం లేదు. తన ఓటమి అంగీకరించడం లేదు. ఈ క్రమంలో తాజాగా దీనిపై అమెరికా ఫెడరల్, స్టేట్ ఎలక్షన్ సీనియర్ అధికారులు గరువారం కీలక ప్రకటన చేశారు. ట్రంప్, ఆయన బృందం చేస్తున్నటువంటి ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు దేశ చరిత్రలో అత్యంత సురక్షిత ఎన్నికలుగా వారు అభిప్రాయపడ్డారు.

అంతేగాకుండా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనడానికి గానీ.. ఓట్లను మార్చారు అని అనడానికి గానీ ఎటువంటి ఆధారాలు లేవని, అమెరికా ఎన్నికల ప్రక్రియపై అనేకమైన నిరాధారమైన ప్రచారాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే అని వ్యాఖ్యానించారు. ‘ఎన్నికలు నిజాయితీగా జరుగుతున్నాయని హామీ ఇస్తున్నాం. ఎన్నికల ప్రక్రియను విశ్వసించండి. దేశ చరిత్రలోనే అత్యంత సురక్షితంగా నవంబర్ 3న ఎన్నికలు జరిగాయి’ అని ప్రకటనలో పేర్కొన్నారు. అయితే తాజాగా దీనిపై ట్రంప్ మళ్లీ ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, దేశ వ్యాప్తంగా తనకు పోలైన 2.7 మిలియన్ ఓట్లు డిలీట్ అయ్యాయని ట్విట్టర్ వేదికగా తెలిపారు.

Advertisement

Next Story