తెలంగాణ అధికారులు చంద్రబాబుతో పోటీ పడాల్సిందే.. CM రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Rajesh |   ( Updated:2024-06-22 08:18:15.0  )
తెలంగాణ అధికారులు చంద్రబాబుతో పోటీ పడాల్సిందే.. CM రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: త్వరలో తెలంగాణలో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు దిశగా ఆలోచిస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ 24వ వార్షికోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా అన్ని రకాల జబ్బులకు సంబంధించి ఇక్కడే వైద్యం అందేలా హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు దిశగా ఆలోచిస్తున్నామన్నారు. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో 500 నుంచి 1000 ఎకరాల్లో వైద్య రంగంలో రాణించిన సంస్థలను రప్పించి అక్కడ వారికి అనుమతులు ఇస్తామన్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చే వారి కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.

చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీ పడే అవకాశం తనకు వచ్చిందన్నారు. చంద్రబాబు 18 గంటలు పనిచేసి తాను 12 గంటలు పనిచేస్తే సరిపోదన్నారు. రాష్ట్ర నేతలు, అధికారులు కూడా 18 గంటలు పనిచేయాల్సిందే అన్నారు. బసవతారకం ఆస్పత్రి లక్షలాది మందికి సేవలందిస్తోందని.. ఈ ఆస్పత్రిని దేశంలో ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు. పేదలకు సేవలందించాలని 1988లో ఆలోచన ముందుకు పడిందన్నారు. సంకీర్ణ రాజకీయాలకు పునాది వేసింది.. ఎన్టీఆరే అన్నారు. రూ.2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, లాంటి అనేక సంక్షేమ పథకాలను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారన్నారు. సినీ రంగాన్ని బాలకృష్ణ చూసుకుంటారని.. లోకేష్, భరత్ రాజకీయాలు, సంక్షేమం బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ బాలకృష్ణ, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, తదతరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story