T Congress: హరీష్ రావు సిగ్గు, శరం ఉంటే రాజీనామా చెయ్.. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఫైర్

by Ramesh Goud |
T Congress: హరీష్ రావు సిగ్గు, శరం ఉంటే రాజీనామా చెయ్.. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బిల్లా, రంగా ప్రజా పాలనను ఓర్వలేక తప్పుడు ప్రచారంతో పన్నాగం పన్నుతున్నారని, కేటీఆర్ ఇంకా తాను మంత్రిగా ఉన్నానని ఫీల్ అవుతున్నాడని, రాజయ్యను అప్పుడు భర్తరఫ్ చేసి ఇప్పుడు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన కమిటీపై మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ నాయకులపై ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలు ఛీ కొట్టి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెప్పినా సిగ్గు రాలేదని, కేటీఆర్ ఇంకా తాను మంత్రిగానే ఫీల్ అవుతున్నాడని ఎద్దేవా చేశారు. ఏ అర్హత తో గాంధీ ఆస్పత్రి పైన బీఆర్ఎస్ ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించిందని, పేదల ఆస్పత్రి గాంధీ పైన కేటీఆర్ కుట్ర చేస్తున్నారని, గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది మనో ధైర్యం దెబ్బ తీయడానికి కేటీఆర్ ప్రయత్నిస్తున్నాడని విమర్శలు చేశారు.

ప్రతిపక్ష నేత పోస్ట్ కోసం కేటీఆర్, హరీష్ పోటీ

పదేళ్ల పాటు రాష్ట్రంలో వైద్యాన్ని నిర్వీర్యం చేశారని, బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు ఎలుకలు కరిచి చనిపోయారని గుర్తు చేశారు. ఇక రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కల్గించడానికే కమిటీల పేరుతో హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో రాజయ్య డీప్యూటీ సీఎం గా ఉంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఓర్వలేక బర్తరఫ్ చేశారని, గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజయ్యకు కనీసం టికెట్ కూడా ఇవ్వకుండా.. ఇప్పుడు ఆయనను ముందు పెట్టి కేటీఆర్ రాజకీయం చేస్తున్నాడని దుయ్యబట్టారు. ఉస్మానియా ఆస్పత్రి మునిగిపోతే కేసీఆర్ ఏనాడు పట్టించుకోలేదని, గడీలు, ఫామ్ హౌస్ లు కట్టుకున్న కేసీఆర్ ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనం నిర్మించలేకపోయాడని ఫైర్ అయ్యారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా మా సీఎం ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచారని తెలిపారు. ఇక డ్రామారావు డ్రామాలు బంద్ చేయాలని, ప్రతిపక్ష నాయకుడి పోస్ట్ కోసం కేటీఆర్, హరీష్ రావు పోటీ పడి మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

డెయిరీలు నాశనం కావడానికి హరీష్ రావే కారణం

అలాగే కేసీఆర్ ప్రభుత్వం విజయ డెయిరీని నిర్వీర్యం చేసిందని, పాల రైతులకు బోనస్ ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించి, మూడేళ్ల నుంచి ఎగ్గొట్టారని, పాల రైతులకు 100 కోట్ల బోనస్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టారని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, హాస్టల్స్ కు టెండర్ లేకుండా గత ప్రభుత్వం పాల సప్లై చేసిందని, విజయ డెయిరీ పాలు కాకుండా హరీష్ రావు సతీమణి చెందిన మిల్చి మిల్క్ ను టెండర్ లేకుండా సప్లై చేశారనే ఆరోపణలున్నాయని తెలిపారు. విజయ, మదర్ డెయిరీ నాశనం కావడానికి హరీష్ రావే కారణమని, రైతుల పాపం హరీష్ రావుకు తగులుతుందని, అమాయక పాల రైతుల సొమ్ము తిన్న వారి నుంచి కక్కిస్తామని స్పష్టం చేశారు. విజయ, మదర్ డెయిరీని కాపాడటానికి మా ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని, పాల సప్లై పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారని తెలిపారు. మదర్ డెయిరీని బీఆర్ఎస్ నాయకులు పందికొక్కుల్లా దోచుకున్నారని, మదర్ డెయిరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన డెరెక్టర్లకు డిపాజిట్లు కూడా రాలేదని అన్నారు. మదర్ డెయిరీ పైన కాంగ్రెస్ జెండా ఎగురవేశామని, విజయ డెయిరీ బకాయిలను కూడా విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు. సిగ్గు శరం ఉంటే హరీష్ రావు రాజీనామా చేయాలని, కేటీఆర్ కూడా కొత్తగా రాజీనామా డ్రామా మొదలు పెట్టారని బీర్ల ఐలయ్య హాట్ కామెంట్స్ చేశారు.

Next Story

Most Viewed