TGSRTC : ఆ ప్రచారంలో నిజం లేదు.. కండక్టర్ అలా చేసినందుకే తొలగింపు! : సజ్జనార్

by Ramesh N |
TGSRTC : ఆ ప్రచారంలో నిజం లేదు.. కండక్టర్ అలా చేసినందుకే తొలగింపు! : సజ్జనార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జ‌న‌గామ డిపోన‌కు చెందిన ఒక కండ‌క్ట‌ర్‌ను అకార‌ణంగా విధుల నుంచి త‌ప్పించార‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంలో నిజం లేదని, ఇది పూర్తి అవాస్త‌వమని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సజ్జనార్ పోస్ట్ చేశారు.

ఈ నెల 1వ తేదిన ఒక మ‌హిళ, త‌న త‌ల్లి, ఏడాది కుమారుడితో క‌లిసి హ‌న్మ‌కొండ నుంచి హైద‌రాబాద్‌కు జ‌న‌గామ డిపోన‌కు చెందిన బ‌స్సు ఎక్కారు. వీరంతా మొద‌టి వ‌ర‌స‌లో ఉన్న మ‌హిళా రిజ‌ర్వ్‌డ్ సీట్ల‌లో కూర్చున్నారు. ఆ స‌మ‌యంలో ఆ సీట్ల‌ను ఖాళీ చేయాలంటూ కండ‌క్ట‌ర్ శంక‌ర్ వారితో అమ‌ర్యాద‌గా, దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. లేకుంటే బ‌స్సు దిగి వెళ్లిపోవాలని చెప్పారు. త‌న అమ్మ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నార‌ని చెప్పిన విన‌కుండా.. ముగ్గురిని మ‌డికొండ వ‌ద్ద బ‌స్సులోంచి దింపేశారు.

ఈ నేపథ్యంలోనే బాధిత మ‌హిళా ప్ర‌యాణికురాలి భ‌ర్త సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్(ట్విట్ట‌ర్) ద్వారా టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం దృష్టికి తీసుకువ‌చ్చారు. అందుకు సంబంధించిన వివ‌రాల‌తో పాటు బ‌స్సు, డ్రైవ‌ర్, కండ‌క్ట‌ర్ ఫొటోల‌ను పోస్ట్ చేశారని సజ్జనార్ వెలడించారు. ఈ ఘ‌ట‌న‌పై యాజ‌మాన్యం విచార‌ణ‌కు ఆదేశించిందని, ఈ ఆదేశాల‌తో ఆర్టీసీ వ‌రంగ‌ల్ రీజియ‌న్ అధికారులు విచార‌ణ జ‌రిపారన్నారు. ఈ విచార‌ణ‌లో మ‌హిళా ప్ర‌యాణికురాలి ప‌ట్ల దురుసుగా, అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించడం, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా మార్గ‌మ‌ధ్యంలో బ‌స్సులోంచి వారిని దించిన‌ట్లు తేల‌డంతో కండ‌క్ట‌ర్‌ను విధుల నుంచి త‌ప్పించ‌డం జ‌రిగిందని స్పష్టం చేశారు.

గ‌తంలోనూ శంక‌ర్‌పై ఇలాంటి ఫిర్యాదులే వ‌చ్చాయన్నారు. దీంతో రెండు సార్లు సస్పెండ్ చేయడంతో పాటు ఒక సారి ఆయనను విధుల నుంచి తొలగించడం (రిమూవ్) జరిగిందని గుర్తు చేశారు. అంతేకాదు, అధికారుల‌కు ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం ఇవ్వ‌కుండా వేర్వేరుగా ఐదు సార్లు మూడున్నరేళ్ల పాటు విధుల‌కు గైర్హాజ‌రు అయ్యారని, మొత్తంగా 12 సార్లు శంక‌ర్‌పై ఫిర్యాదులు వ‌చ్చాయన్నారు. అయినా మాన‌వ‌త దృక్ఫ‌థంతో సంస్థ ఆయ‌న‌కు పోస్టింగ్ ఇవ్వ‌డం జ‌రిగిందన్నారు. తాజాగా మ‌ళ్లీ ఫిర్యాదు రావ‌డంతో విచార‌ణ జ‌రిపి గ‌తంలో మాదిరిగానే శాఖ‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌ను సంస్థ తీసుకుందన్నారు.

ఆర్టీసీకి ప్రయాణికులే దేవుళ్ళు. ప్ర‌యాణికుల‌కు మెరుగైన, నాణ్య‌మైన ర‌వాణా సేవ‌లందించేందుకు సిబ్బంది నిబ‌ద్ద‌త, అంకిత‌భావంతో ప‌నిచేస్తున్నారని తెలిపారు. 45 వేల ఆర్టీసీ సిబ్బంది క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విధులు నిర్వ‌ర్తిస్తూ ప్ర‌తి రోజు స‌గ‌టున 55 ల‌క్ష‌ల మందిని క్షేమంగా గ‌మ్య‌స్థానాల‌కు చేర‌వేస్తున్నారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో సేవాతర్పరత చాటుతున్న సిబ్బందిని ఎక్స్‌ట్రామైల్ కార్యక్రమం ద్వారా సంస్థ సత్కరిస్తోందని పేర్కొన్నారు. ప్రయాణికుల నుంచి వచ్చే ఫిర్యాదులను సంస్థ సీరియస్‌గా తీసుకుంటోందని, వాటిని వీలైనంత త్వరగా విచారణ జరుపుతోందన్నారు. ఫిర్యాదుల విష‌యంలో నిబంధ‌న‌ల ప్ర‌కారమే యాజమాన్యం న‌డుచుకుంటోందని, అన్ని కోణాల్లో స‌మ‌గ్రంగా విచార‌ణ జ‌రిపి చ‌ర్య‌లు తీసుకుంటున్నట్లు పోస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed