చెరువు కబ్జా చేసి రోడ్డు..

by Sumithra |
చెరువు కబ్జా చేసి రోడ్డు..
X

దిశ, శంకర్పల్లి : అధికారుల నిర్లక్ష్యం అక్రమార్కులకు వరంగా మారింది. అధికారుల మొద్దు నిద్రలో ఉండడంతో అక్రమార్కులు ఏకంగా చెరువులో నుంచి రోడ్ వేశారు. పూర్తివివరాల్లోకెళితే జన్వాడ గ్రామంలోని శిఖం పట్టాభూమిలో సుమారు 40- 50 ఎకరాల విస్తీర్ణంలో సింహచెరువు ఉంది. కాగా దీని ఆయకట్టు కింద సుమారుగా 70 - 80 ఎకరాల భూమి సాగవుతుంది. అయితే ఇటీవల కొందరి అక్రమార్కుల కన్ను ఈ చెరువు పై పడింది. అనుకున్నదే తడువుగా తమను ఎవరు ఏం చేస్తారు లే ? అనే ధీమాతో చెరువులో నుండే అక్రమంగా రోడ్డు వేశారు. వందలాది ట్రిప్పల మట్టిపోసి సుమారుగా 40 ఫీట్ల వెడల్పుతో రోడ్డు వేశారు. అక్రమంగా వేసిన రోడ్డులో నుంచే విద్యుత్ అధికారులు కరెంటు లైన్ ఇచ్చారు. చెరువును ఆక్రమించి వేసిన రోడ్డులో నుంచే విద్యుత్ అధికారులు కరెంటు స్తంభాలు పాతి విద్యుత్తు లైను ఇవ్వడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతవారం రోజుల క్రితం శంకర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో జన్వాడ ఎంపీటీసీ నాగేందర్, మీర్జాగూడ సర్పంచ్ రవీందర్ గౌడ్ లు చెరువును కబ్జా చేసి రోడ్డు వేసిన విషయం సభలో ప్రస్తావించారు. చెరువు పూడ్చితే రెండు గ్రామాల ప్రజలకు మంచినీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమార్కుల పై చర్యలు తీసుకొని రోడ్డు కోసం చెరువులో వేసిన మట్టిని తీసివేయాలంటూ వారు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. చెరువు పక్కన నిర్మించిన ప్రహరీ గోడ సైతం ఎఫ్టీఎల్ పరిధిని దాటి కట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ పేరుతో నిధులు మంజూరు చేసి చెరువులను తవ్విస్తుండగా, అక్రమార్కులు మాత్రం ఉన్న చెరువులను పూడ్చి వేస్తుండడం పట్ల జన్వాడ, మీర్జాగూడ గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు.

ఈ చెరువు నిండితే జన్వాడ రెవెన్యూ పరిధిలోని భూములు సాగవుతాయి. భూగర్భ జలాల నీటిమట్టం పెరిగి మంచినీటికి సైతం ఎలాంటి కొరత ఉండదు. నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు చెరువు విస్తీర్ణాన్ని కొలతలు చేసి ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చిన నిర్మాణాలను కూల్చాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా చెరువును ఆక్రమించి వేసిన రోడ్డును తీసివేసి, అక్రమార్కుల కబంధహస్తాల్లో నుంచి చెరువును కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు. ఈ విషయమై నీటిపారుదల శాఖ ఏఈ రాధికను వివరణ కోరగా ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ప్రహరీగోడ యజమానిపై 2021 లోనే పోలీస్ కేసునమోదు అయింది. అదేవిధంగా సింహ చెరువులో నుంచి రోడ్డు వేసిన వ్యక్తి పై గత డిసెంబర్ నెలలో పోలీస్ కేసునమోదు అయింది. పోలీసులు వద్దు అన్నందుకే మట్టిని తీసి వేయలేము. కేసు పూర్తయిన అనంతరం మట్టిని తీసివేస్తాము. రోడ్డులో నుంచి పోకుండా కందకాలు (రోడ్డు మధ్యలో గోతులు) తీస్తాము. చెరువులను సంరక్షించేందుకు చర్యలు చేపట్టుచున్నాము.

Next Story

Most Viewed