మోదీ పాలనలో భారత్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది

by Sridhar Babu |
మోదీ పాలనలో భారత్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది
X

దిశ, ముషీరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ పరిపాలన ఫలితంగానే బలమైన 5వ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నేడు భారతదేశం నిలిచిందని, అతి త్వరలో 3వ అతి పెద్ద ఆర్థిక శక్తిగా అవతరించనుందని కేంద్ర విద్యుత్, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ బీమా మైదాన్ వాంబే కాలనీ లో జరిగిన వికసిత భారత్ సంకల్ప యాత్ర లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా కేంద్ర ప్రభుత్వ సమాచారంతో కూడిన ఐఈసీ మెటీరియల్‌ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వివిధ విభాగాలకు చెందిన స్టాళ్లను సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సమాచార డిజిటల్ వాహనాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ వివిధ పథకాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి, ప్రజలు నేరుగా వాటి నుండి లబ్ధి పొందేందుకు స్టాళ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ప్రధాని మోదీ నేతృత్వంలో పదేళ్ల పాలనలో భారత్ ప్రపంచంలోనే 5వ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ గా అవతరించిందని, దీంతో దేశ ఆర్థిక పరిస్థితి మారుతోందన్నారు. దీని ప్రతిఫలం ప్రతి పేదవాడికి చేరువవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో సాధించిన ప్రగతిని ఆయన వివరించారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు, లబ్ధిదారుల విజయగాథను 'వికసిత భారత్ సంకల్ప యాత్ర' చెబుతోందన్నారు. ఇది ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు పథకం ప్రయోజనాలను పొందని వారికి అందజేయడమే ఈ డిజిటల్ వాహనం ఉద్దేశమని ఆయన తెలియజేశారు. ప్రతి నెలా 80 కోట్ల మందికి 5 కిలోల బియ్యం 5 సంవత్సరాల క్రితమే ప్రారంభమైందని, చిన్న వ్యాపారాలు చేసే వారికి ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వడం సులభతరం చేసింది మోదీ ప్రభుత్వమేనని చెప్పారు. వీధి వర్తకులకు పీఎం స్వానిధి ద్వారా రుణాలు మంజూరు చేసి వారి ఉన్నతికి నరేంద్ర మోదీ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు.

మహిళలు కష్ట పడకుండా ఉండాలని పీఎం ఉజ్వల యోజన ద్వారా వంట గ్యాస్, ఆయుష్మాన్ భారత్ ద్వారా నిరుపేదలకు 5 లక్షల వరకు ఉచితంగా వైద్య సదుపాయం ప్రధాన మంత్రి కల్పించారన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న ప్రతి పథకం ప్రతి ఇంటికి చేరుకోవాలనే లక్ష్యంతో మోదీ గ్యారంటీ వ్యాన్ వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా అందరికీ చేరుకుంటుందన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంతిల్లు లభిస్తుందని, వివిధ కారణాలతో తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఇల్లు లభించని వారికి సొంతింటి కల నెరవేరేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి అన్నారు. వాంబే కాలనీలో ప్రస్తుతం ఉన్న నిర్మాణాల మరమ్మతులకు సంబంధించి కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ మంత్రితో మాట్లాడినట్లు, త్వరలోనే మరమ్మతులు పూర్తయ్యేలా చూస్తానని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, బీజేపీ నాయకులు, బస్తీవాసులు పాల్గొన్నారు.

Advertisement

Next Story