SRSP : ఎస్సారెస్పీలో పెరిగిన వాటర్ లెవెల్..

by Sumithra |
SRSP : ఎస్సారెస్పీలో పెరిగిన వాటర్ లెవెల్..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో మూడు రోజుల్లో 4 టీఎంసీల వాటర్ లెవెల్ పెరిగింది. రెండు, మూడు రోజులుగా ముసురు పట్టి కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరద ఇన్ ఫ్లో పెరిగింది. మూడు రోజుల్లో ఎస్సారెస్పీలో వాటర్ లెవెల్ 4.477 టీఎంసీలకు పెరిగింది. ఈనెల 18 న ఉదయం 6 గంటలకు ప్రాజెక్టులో వాటర్ లెవెల్ 14.356 టీఎంసీలు ఉండగా, 21 న ఉదయం 6 గంటలకు 18.833 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి 18,518 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.

ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఇంకా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున ప్రాజెక్టులోకి ఇంకా వరద పోటెత్తే అవకాశాలున్నాయి. వాటర్ లెవెల్ మరింత పెరగనుంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రాజెక్టులో నీటిమట్టం పెరిగి 1067.40 అడుగులు, 19.185 టీఎంసీలకు చేరుకుంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ పథకంలో భాగంగా కోరుట్ల, జగిత్యాల లకు 61 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ లకు 63 క్యూసెక్కులు, ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాలకు 107 క్యూసెక్కుల నీటిని అధికారులు ప్రతిరోజు యధావిధిగా విడుదల చేస్తున్నారు. 262 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో గాల్లో కలిసిపోతోంది.

Next Story