ఉపాధ్యాయులతో దురుసుగా ప్రవర్తించొద్దు

by Sridhar Babu |
ఉపాధ్యాయులతో దురుసుగా ప్రవర్తించొద్దు
X

దిశ, నవీపేట్ : రేపటి భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులతో తల్లిదండ్రులు మర్యాదగా వ్యవహరించాలని, బోధించే క్రమంలో విద్యార్థులను మందలించే ఉపాధ్యాయుల పట్ల దురుసుగా ప్రవర్తించొద్దని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తల్లిదండ్రులకు సూచించారు. మండలంలోని బినోల ఉన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయి క్రీడా పోటీల ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని కోరారు. విద్యార్థుల సౌకర్యార్టం అవసరమైన తాగునీరు, మూత్రశాలల నిర్మాణం, నూతన గదుల నిర్మాణం తదితర మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేస్తామని తెలిపారు.

విద్యార్థినికి రూ.5 వేల ప్రోత్సాహక బహుమతి

సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా శివ తాండవ నృత్యం చేసిన నాలేశ్వర్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని సంజనకు ఎమ్మెల్యే రూ.5 వేలు అందజేశారు. త్రిశూలం పట్టి శివతాండవం చేసినట్లు సమాజంలో గల చెడును చీల్చి చెండాలని కోరుతూ రూ.5 వేలు ఇచ్చినట్లు తెలిపారు. ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ హుందాన్, డీఈవో దుర్గా ప్రసాద్, ఎంపీడీఓ నాగనాథ్, ఎంఈఓ గణేష్ రావు, స్కూల్ హెడ్ మాస్టర్ మోహన్ రెడ్డి, పీఆర్టీయూ మండల అధ్యక్షులు భూమన్న, ప్రధాన కార్యదర్శి శివ కుమార్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పీఈటీలు, పీడీలు, అధికారులు, మండల కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed