ఓటుకు నోటు కేసులో 16న విచారణకు రావాలి : సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు

by Y. Venkata Narasimha Reddy |
ఓటుకు నోటు కేసులో 16న విచారణకు రావాలి : సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఓటుకు నోటు కేసులో నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆక్టోబర్ 16న జరిగే విచారణకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. మంగళవారం జరిగిన విచారణకు మత్తయ్య హాజరవ్వగా..కేసులోని ఇతర నిందితులు గైర్హాజరయ్యారు. ఈడీ కేసు విచారణలో నిందితులు హాజరు కాకపోవడంపై నాంపల్లి ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు తప్పకుండా హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. వచ్చేనెల 16వ తేదీకి విచారణను వాయిదా వేసింది. ఆ రోజు సీఎం రేవంత్ సహా నిందితులు అందరూ కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసును తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ భోపాల్ కోర్టుకు బదిలీ చేయాలంటూ మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి పిటీషన్ ను ఇటీవలే సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసు విచారణ కొనసాగిస్తున్న నాంపల్లి కోర్టు తదుపరి విచారణకు హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించడం సంచలనంగా మారింది. 2015లో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్ ను టీడీపీ పార్టీకి మద్ధతుగా వ్యవహరించమని డబ్బు ఆశచూపిన ఆరోపణలపై అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. స్టీఫెన్‌ సన్‌ ఇంట్లో రేవంత్‌ రెడ్డి డబ్బు సంచులతో ఉన్నట్లు ఉన్న వీడియోలు అప్పట్లో సంచలనంగా మారాయి. దీంతో కేసు నమోదు చేసిన ఏసీబీ దీనిపై సుధీర్ఘంగా విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగానే నాంపల్లి కోర్టు సీఎం రేవంత్ రెడ్డితో పాటు నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్ సింహా, మత్తయ్య జెరూసలేం, సండ్ర వెంకట వీరయ్య, వేం కృష్ణ కీర్తన్‌కు సమన్లు జారీ చేసింది.

Next Story

Most Viewed