అకాల వర్షాలతో జిల్లాలో విద్యుత్ శాఖకు భారీ నష్టం

by Sridhar Babu |
అకాల వర్షాలతో జిల్లాలో విద్యుత్ శాఖకు భారీ నష్టం
X

దిశ , సూర్యాపేట : జిల్లాలో గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాల వల్ల విద్యుత్తు శాఖకి తీవ్ర నష్టం వాటిల్లినట్టు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ వెల్లడించారు. ఈ భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలోనే అత్యధికంగా విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లాలోని సూర్యాపేట, కోదాడ డివిజన్ లోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించి పలు సబ్ స్టేషన్లను ఇతర విద్యుత్ నెట్వర్క్ లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,127 విద్యుత్ స్తంభాలు నేలకొరగగా, 319 ట్రాన్స్ ఫార్మర్లు పాడైపోయాయని అన్నారు.

ఇందులో 4 సబ్ స్టేషన్లు సైతం ముంపునకు గురయ్యాయని తెలిపారు. వాటికి యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేపడుతున్నట్లు వెల్లడించారు. కోదాడ డివిజన్ లోని రామాపురం, ఎంబీ గూడెం సబ్ స్టేషన్లను, ఇతర విద్యుత్ నెట్వర్క్ ను పరిశీలించారు. ఈ వర్షాల వల్ల వీచిన ఈదురు గాలుల ప్రభావంతో చెట్లు, కొమ్మలు విరిగి విద్యుత్ స్తంభాలపై పడటంతో 15/33 కేవీ పోల్స్,1074/11 కేవీ పోల్స్, 1038 LT పోల్స్,319 ట్రాన్స్ ఫార్మర్స్ దెబ్బతిన్నట్లు వివరించారు. అందుకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించడం కోసం తమ శాఖ అధికారులు, సిబ్బంది అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. ఈ పర్యటనలో సీఎండీతో పాటు సూర్యాపేట చీఫ్ ఇంజినీర్ రూరల్ జోన్ పి. భిక్షపతి, సూపరింటెండింగ్ ఇంజినీర్ ఫ్రాంక్లిన్, డివిజనల్ ఇంజినీర్లు, ఇతర అధికారులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed