సుమాల్ పై పర్యవేక్షణ ఏది..?

by Aamani |
సుమాల్ పై పర్యవేక్షణ ఏది..?
X

దిశ,మేడ్చల్ బ్యూరో : “చెరువుని పూడ్చివేత పై ఎప్పుడో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేశాం.. హైడ్రా అధికారులు కూడా ప్రస్తుత చెరువు పూడ్చివేతపై వివరాలు తీసుకున్నారు”. ఇది దూలపల్లి, గుడ్ల పోచంపల్లి గ్రామ పరిధిలో ఉన్న ’సుమాల్ చెరువు ‘అన్యాక్రాంతం పనులపై సంబంధిత శాఖ అధికారులు ఇస్తున్న సమాధానం ఇది. కానీ పోలీసులకు ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ.. హైడ్రాధికారులు ఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నప్పటికీ సుమాల్ చెరువులో యథేచ్ఛగా పూడ్చివేత పనులు నేటికీ కొనసాగుతున్నాయి.

పోలీస్ స్టేషన్ లో ఎవరిపై ఫిర్యాదు చేశారంటే..?

2023 ఫిబ్రవరి 4 మేడ్చల్ జిల్లా ఇరిగేషన్ అధికారులు సుమాల్ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ భూమిలో అక్రమంగా మట్టిని నింపుతూ నిర్మాణాలు చేస్తున్నాడని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ యధాతధంగా పనులు కొనసాగాయి. ఇదే క్రమంలో ఆగస్టు 16న ఆ ప్రాంతంలో ఉన్న పలు నిర్మాణాలను సంబంధిత శాఖ అధికారులు కూల్చివేశారు. అయినప్పటికీ ఆ ప్రాంతంలో తిరిగి రేకుల తో కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసి లోపల చిన్నచిన్న షెడ్లను నిర్మించారు. సదరు వ్యక్తి చెరువు భూమిలో తనకి పట్టా ఉన్నదని దాదాపుగా 8 ఎకరాల చెరువు భూమిని మట్టి, బండరాళ్లతో నింపివేశాడు.

తాజాగా పూడ్చివేత పనులు..

గతంలో పూడ్చివేత పనులను పక్కన పెడితే ఇదే చెరువు లో సర్వే నెంబర్ 534, 535 లో పెద్ద మొత్తంలో తాజాగా పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ కాపలాదారుడిగా ఒక వ్యక్తిని సైతం చెరువుని పూడ్చి వేస్తున్న వారు ఏర్పాటు చేశారు. గుడ్ల పోచంపల్లి ఏపీరియల్ పార్కు రోడ్డులో ఇరువైపులా 44 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువుకు 2014లో ఇరిగేషన్, హెచ్ఎండిఏ లు సంయుక్తంగా చేపట్టి కోఆర్డినేట్స్ ఫిక్స్ చేశారు. దీని ప్రకారం కోఆర్డినేట్ ఏ 55 నుంచి ఏ 60 వరకు ఉన్న ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతంలో ప్రస్తుతం పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి.

గతంలో చేసిందే చెబుతున్నారు కానీ..

ప్రస్తుతం సుమాల్ చెరువులో కొనసాగుతున్న పనులపై ఏ ఒక్క శాఖ అధికారికి కూడా దృష్టిలో లేనట్లుగానే చెబుతున్నారు. ప్రధాన రహదారిలో బహిరంగంగా చెరువు పూర్చివేత పనులు చేస్తుంటే తెలియదని చెబుతున్న అధికారులుకు చెరువు సంరక్షణ, పర్యవేక్షణ బాధ్యతలు ఏమేరకు నిర్వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎంతసేపటికి గతంలో మేం కేసులు పెట్టాం.. అక్కడ ఉన్న నిర్మాణాలను తొలగించేసాం అని చెప్పిందే చెబుతున్నారు గాని.. ప్రస్తుతం జరుగుతున్న పూడ్చివేత పనులను మాత్రం అడ్డుకోవడం లేదు. కొత్తగా మట్టి, బండరాళ్లు నింపుతున్న విషయంపై తమకు సమాచారం లేదని, వెంటనే సిబ్బందిని పంపించి తెలుసుకుంటామని ఇరిగేషన్ శాఖకు చెందిన ఓ అధికారి చెప్పడం గమనార్హం. మొత్తంగా సుమాల్ చెరువు సంరక్షణపై పై అధికారులు ఏమాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదనేది విషయం ఈ చెరువు అన్యాక్రాంతం అంశంపై ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed