మరో భూ వివాదంలో ఎమ్మెల్యే పల్లా.. 4 ఎకరాలు కబ్జా చేశాడంటున్న బాధితులు

by Nagam Mallesh |
మరో భూ వివాదంలో ఎమ్మెల్యే పల్లా.. 4 ఎకరాలు కబ్జా చేశాడంటున్న బాధితులు
X

దిశ, ఘట్కేసర్ః జనగామ ఎమ్మెల్యే, అనురాగ్ విద్యాసంస్థల చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మరో భూవివాదంలో ఇరుక్కున్నారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ రెవెన్యూ సర్వే నెంబర్ 813లోని నాడెం చెరువు బఫర్ జోన్ లో నీలిమ మెడికల్ కాలేజ్, నీలిమ ఆసుపత్రి నిర్మించారని ఇరిగేషన్ అధికారులు పోచారం ఐటి కారిడార్ పిఎస్ లో ఫిర్యాదు మేరకు కేసు నమోదైన విషయం తెలిసిందే. కాగా సోమవారం వెంకటాపూర్ గ్రామం పరిధిలోని సర్వేనెంబర్ 796లోని నీలిమ ఆసుపత్రి సమీపంలో నాలుగు ఎకరాల తమ పట్టా భూమిని పల్లా రాజేశ్వర్ రెడ్డి కబ్జా చేసాడంటూ హయత్ నగర్ మండలం, కుంట్లూరు గ్రామ మాజీ సర్పంచ్ కల్లెం ప్రభాకర్ రెడ్డి, రాజేష్, శివారెడ్డి సాయి సిద్ధార్థ అనే నలుగురు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరులు, నీలిమ ఆసుపత్రి సిబ్బంది మీడియా సమావేశం అడ్డుకుని గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దాడికి నిరసనగా బాధితులు అక్కడే బైఠాయించారు. ఇంతలో పోచారం ఐటీ కారిడార్ పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాల వారిని శాంతింప జేశారు. అయితే గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్ల పాటు మా భూమి తమకు చెందకుండా అడ్డుకుంటూ బెదిరింపులకు గురి చేస్తూ పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలయాపన చేశాడని... ఇప్పుడు కూడా తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడని బాధితులు వాపోయారు. తమ పట్టా భూమి తమకు చెందే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డి అనుచరులు పల్లా సతీష్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, బుర్రా రామారావ్ మరో పది మందిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

మేము ఎవరి భూములు ఆక్రమించలేదు...

వెంకటాపూర్ సర్వేనెంబర్ 796 లోని భూమిని చట్టపరంగా రిజిస్ట్రేషన్ చేసుకుని హక్కులు పొందామని, ఎవరి భూములు మేము ఆక్రమించలేదని గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రతినిధి మధుకర్ రెడ్డి తెలిపారు. కల్లెం ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో మా భూముల్లోకి చొరబడి అనురాగ్ విద్యాసంస్థలు, నీలిమ ఆసుపత్రి, మెడికల్ ఇన్ స్టిట్యూట్ చైర్మన్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని దుర్భాషలాడి అనవసరంగా రాద్ధాంతం చేయడం సరికాదన్నారు.

Next Story

Most Viewed