illegal villas : కేసులు పెట్టినా .. ఆగని అక్రమ నిర్మాణాలు..

by Sumithra |
illegal villas : కేసులు పెట్టినా .. ఆగని అక్రమ నిర్మాణాలు..
X

దిశ, మేడ్చల్ బ్యూరో/దుండిగల్ : విలువైన సర్కారీ స్థలాలను కాజేస్తున్నారు. ప్రభుత్వం పెట్టిన హెచ్చరిక బోర్డులను మాయం చేస్తున్నారు. సెలవు దినాల్లో గుండాలను కాపలా పెట్టి.. రాత్రికి రాత్రే అక్రమంగా విల్లాలను నిర్మిస్తున్నారు. పోలీస్ కేసులను సైతం లెక్క చేయడంలేదు. అధికార పార్టీ నేతల బలం.. కొందరు ఆఫీసర్ల అండదండలతో యధేచ్చగా రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు సాగిస్తున్నారు. మేడ్చల్ జిల్లా, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేటలోని సర్వేనెంబర్ 170లో రూ.25 కోట్ల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి విల్లాల నిర్మాణాలు చేపడుతున్నా.. యంత్రాంగం చూసీ చూడనట్లు వ్యవహారిస్తుండడం పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి.

తప్పుడు పత్రాలు..హెచ్ఎండీఏ అనుమతులు..

దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట రెవెన్యూ సర్వే నెంబర్ 170/5 ఎక్ట్సెంట్ చూపుతూ సర్వే నెంబర్ 170/1 లో 2946.07 చదరపు గజాల ప్రభుత్వ భూమిలో ’’లక్ష్మి శ్రీనివాస్‘‘ కన్ స్ట్రక్షన్ సంస్థ 17 విల్లాలను నిర్మిస్తోంది. ప్రభుత్వ భూమిలో వైడ్ నంబర్.002095/హెచ్ఎండీఏ/0433/ఎంఈడి/2023 పేరిట 2023, మే 4న 17 విల్లాలకు హెచ్ఎండీఏ అనుమతులు ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. అయితే ప్రభుత్వ భూమిలో అక్రమనిర్మాణాలు చేపడుతుండడంతో ఫిర్యాదులు అందుకున్న రెవెన్యూ అధికారులు 2024, మా మార్చిలో సదరు అక్రమనిర్మాణాలను జెసిబి సహాయంతో కూల్చివేశారు. అంతేకాకుండా జాయింట్ సర్వే నిర్వహించి హెచ్ఎండీఏ అనుమతులు రద్దుచేయాలంటూ 2024,ఏప్రిల్ 15 న దుండిగల్ తహసీల్దార్, హెచ్ఎండీఏ కమిషనర్ కు లేఖ కూడా రాశారు.

అయితే అప్పటికే ప్రభుత్వ స్థలంలో విల్లాల కోసం కస్టమర్ల దగ్గర లక్ష్మి శ్రీనివాస్ సంస్థ రూ. కోట్లలో డబ్బులు వసూలు చేసింది.దీంతో ఈ ప్రాజెక్టును ఏలాగైనా పూర్తి చేసి పరువు నిలబెట్టుకోవాలని నిర్మాణ సంస్థ చూస్తోంది. స్థానిక అధికార పార్టీకి చెందిన ఓ నేత అండతో ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి చేయిస్తుంది. ఎవరైనా అధికారులు అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లితే..సదరు నేత సదరు అధికారిని బదిలీ చేయిస్తానని బేధిరింపులకు దిగుతున్నారని వాపోతున్నారు. ఓ వైపు ప్రభుత్వ స్థలాలు కాపాడలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తున్న ఆదేశాలనూ అధికార పార్టీలతోపాటు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పెద్దగా పట్టించుకోవడంలేదు. వెరసి భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలను చేపడుతూ తెలంగాణ ప్రభుత్వానికే సవాల్ విసిరుతున్నారు.

కేసులకే పరిమితం.. చర్యలు శూన్యం..

2021 లో పంచాయితీ అధికారులను మ్యానేజ్ చేసి ‘విహానా వెంచర్స్ ’ గ్రూప్ ఆఫ్ కన్ స్ట్రక్షన్ పేరిట ఫోర్జరీ సంతకాలతో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో సంస్థ యజమాని పై అప్పట్లో పలుకేసులు నమోదయ్యాయి. అయినా నిర్మాణ సంస్థ యాజమాన్యం పై చర్యలు తీసుకోకపోవడంతో.. తీరుమారడంలేదు. గత ఫిబ్రవరి నెలలో కాలనీలోని పార్క్ స్థలాన్ని అక్రమించేందుకు జేసీబీ సహాయంతో ఆటవస్తులను కూల్చేవేసి అడ్డువచ్చిన మహిళ పై దాడులకు దిగడంతో కాలనీ వాసులు దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో సంస్థ యాజమాన్యం పై పలు కేసులు నమోదయ్యాయి. ఇదిలావుంటే తాజాగా రూ. 25 కోట్ల విలువచేసే ప్రభుత్వ స్థలంలో తప్పుడు పత్రాలు సృష్టించి 17 విల్లాలకు హెచ్ఎండీఏలో అనుమతులు పొంది యధేచ్చగా అక్రమనిర్మాణాలు చేపడుతున్నా.. ప్రభుత్వ యంత్రాంగం కట్టడి చేయలేకపోతుంది.

బోర్డులు పీకేసీ...

లక్ష్మి శ్రీనివాస్ నిర్మాణ సంస్థ తప్పుడు పత్రాలతో హెచ్ఎండీఏ అనుమతులు పొందిన సర్వే నెంబర్ 170/6 స్థలంలో రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు తరచూ మాయమవుతున్నాయి. జూలై నెల 6న ఏర్పాటు చేసిన ప్రభుత్వ సూచిక బోర్డును భూ కబ్జాదారులు పీకేశారు. విలువైన ప్రభుత్వ స్థలాన్ని రక్షించాలని స్థానిక ప్రజాప్రతినిధులు,ప్రజలు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికార యంత్రాంగం స్పందించకపోవడంతో ’దిశ‘ పత్రిక దృష్టికి తీసుకురాగా, లక్ష్మి శ్రీనివాస్ నిర్మాణ సంస్థ చేస్తున్న మోసాలపై పతాక శీర్షికన వరుస కథనాలను ‘దిశ‘లో ప్రచురించింది. రెవెన్యూ యంత్రాంగం స్పందించింది.ఈ నెల 11వ తేదీన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తూ చర్యలుంటాయని హెచ్చరిక బోర్డును పెట్టారు. మరుసటి రోజునే దుండగలు రెవెన్యూ యంత్రాంగం పెట్టిన సూచిక బోర్డును మాయం చేశారు. దీంతో 12వ తేదీన ‘దిశ’ ప్రభుత్వ ’సూచిక బోర్డు మాయం‘ కథనాన్ని వెబ్ లో ప్రచురించింది. స్పందించిన రెవెన్యూ అధికారులు అగమేఘాల మీద మరోసారి ఆ స్థలంలో బోర్డును ఏర్పాటు చేశారు.మూడో సారి అనగా జూలై 26న రాత్రి ప్రభుత్వ హెచ్చరిక బోర్డును మరోసారి భూ కబ్జాదారులు మాయం చేసేశారు.

బోర్డు మాయమైన విషయాన్ని గమనించిన స్థానికులు శనివారం మరోసారి ‘దిశ’ ప్రతినిధి దృష్టికి తీసుకువెళ్లగా, విషయం దుండిగల్ గండిమైసమ్మ మండల తాహసీల్దార్ అబ్దుల్ సయ్యద్ మతీన్ దృష్ఠికి వెళ్లింది.తహాసీల్దార్ సూచన మేరకు అదే రోజు సాయంత్రం ముచ్చటగా మూడవ సారి రెవెన్యూ సిబ్బంది బోర్డును ఏర్పాటు చేశారు. అయితే మింగుడు పడని లక్ష్మి శ్రీనివాస్ నిర్మాణ సంస్థ యాజమాన్యం వారం రోజులపాటు వేచి చూసింది. వారం తిరక్కకుండానే రెండు రోజుల క్రితం (శుక్ర, శని వారాల్లో) రాత్రిపూట పెద్ద ఎత్తున ప్రైవేట్ వ్యక్తులను కాపలా పెట్టి ప్రభుత్వ స్థలమని హెచ్చరిక బోర్డు పెట్టిన స్థలంలో విల్లాల నిర్మాణం కోసం ఫిల్లర్లు నిర్మిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై స్థానికులు వీడియోలు, ఫోటోలు తీసి రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందా..? అక్రమార్కులకు అండగా నిలుస్తుందా..? వేచి చూడాల్సిందే...



Next Story