పోచారంలో రూ.20 కోట్ల పార్కు స్థలం మాయం..రెవెన్యూ అధికారుల చేతివాటం

by Aamani |
పోచారంలో రూ.20 కోట్ల పార్కు స్థలం మాయం..రెవెన్యూ అధికారుల చేతివాటం
X

దిశ, ఘట్కేసర్ : రాష్ట్ర రాజధాని శివారు ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ లేఔట్ లలో ఖాళీ స్థలాలపై బడా రియల్టర్ల కన్ను పడింది. దాదాపు 37 ఏళ్ల క్రితం చేసిన గ్రామపంచాయతీ లేఅవుట్ చెల్లదని పట్టాదారులతో ఒప్పందాలు కుదుర్చుకొని రూ.కోట్ల విలువ చేసే భూములను కొనుగోలు చేసి రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కుతున్నారు. నాలా కన్వర్షన్ చేసుకొని హెచ్ఎండిఏ నుంచి అనుమతులు పొంది భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. అప్పట్లోనే పంచాయతీ లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఎవరైనా లేఔట్ ప్రాంతానికి వస్తే బెదిరింపులకు పాల్పడుతూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ లో ఓ బాధితుడి ఫిర్యాదుతో రూ.కోట్ల విలువ చేసే పార్కు స్థలం అన్యాక్రాంతమైన విషయం వెలుగులోకి వచ్చింది.

1986 లో ఏర్పడిన శ్రీరామ కాలనీ...

నారపల్లి లో సర్వే నెంబర్ 27, 28 లో 14 ఎకరాల్లో గ్రామ పంచాయతీ లేఔట్ లో 174 ప్లాట్లు చేసి అంజయ్య, సరాజమ్మలు అమ్ముకున్నారు. పంచాయతీ అనుమతులతో అక్కడ కాలనీలో కొందరు ఇండ్లు నిర్మించుకున్నారు. రెవెన్యూ రికార్డుల్లో భూముల వివరాలు మారకపోవడం, నగర శివారు ప్రాంతంలో భూముల ధరల రూ. కోట్లలో పలకడంతో పట్టాదారులకు కలిసొచ్చింది. 37 ఏళ్ల క్రితం తాము చేసిన వెంచర్లో ఖాళీ స్థలాల్లోని 1.10 ఎకరాల భూమిని RNK AGRO AND CHEMICALS PVT LTD సంస్థకు అమ్ముకున్నారు. ఈ సంస్థ ముందస్తుగా ప్రణాళిక ప్రకారం నాలా కన్వర్షన్లు చేయించుకుని హెచ్ఎండిఏ నుంచి బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు తెచ్చుకుని జైన్ కన్స్ట్రక్షన్ సంస్థకు అపార్ట్మెంట్ ల నిర్మాణాలు చేపట్టే కాంట్రాక్ట్ ఇచ్చారు. గ్రామ పంచాయతీ లేఔట్ లో పార్క్ స్థలంతో పాటు పక్కనే ఉన్న ప్లాట్లను సైతం కబ్జా చేసి నిర్మాణం చేస్తుండటంతో వివాదం తలెత్తింది. పోచారం మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు, అధికారులు మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 137, 138 లో వెంకటేశ్వర నగర్ లోని పార్క్ స్థలం కబ్జాపై సంఘటితంగా పోరాడి కబ్జాదారుల చెర నుంచి విముక్తి చేసుకున్నారు. నారపల్లిలో సర్వేనెంబర్ 27, 28 లోని 1.10 ఎకరం పార్క్ స్థలాన్ని బడా రియల్టర్లు, కాంట్రాక్టర్లు స్వాధీనం చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ స్థలాలు కాపాడాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

హెచ్ఎండీఏ కమిషనర్ కు లేఖ రాసిన పోచారం మున్సిపాలిటీ మాజీ కమిషనర్...

పోచారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపాలిటీ పదవ వార్డ్ కౌన్సిలర్ బాలగోని వెంకటేష్ గౌడ్ మార్చి నెలలో నారపల్లిలోని శ్రీరా కాలనీలో పార్కు స్థలం అన్యాక్రాంతం విషయంపై అప్పటి మున్సిపల్ కమిషనర్ వేమారెడ్డికి ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు పై వేమారెడ్డి హెచ్ఎండీఏ కమిషనర్ కు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని జూన్ నెలలో లేఖ రాశారు. కానీ ఇప్పటివరకు హెచ్ఎండి అధికారులు ఎలాంటి చర్యలు విచారణ చేపట్టకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. స్థానికంగా ఓ బడా కాంట్రాక్టర్, ప్రజా ప్రతినిధి సెటిల్మెంట్లకు పూనుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 20 కోట్ల విలువచేసే పార్క్ భూమిని ఊరికే ఎలా వదులుకుంటాం ఎంతో కొంతైనా ఇవ్వాల్సిందేనని బేరసారాలకు దిగినట్లు సమాచారం.

రెవెన్యూ అధికారులదే పొరపాటు : పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి

ఏదైనా భూముల్లో లేఔట్ చేసిన తర్వాత ప్లాట్లు అమ్మకాలు జరిగితే రెవెన్యూ రికార్డులు మార్పులు జరగాలి... కానీ అలాంటివి జరగకపోవడం వల్ల నారపల్లి లో 1.10 ఎకరం స్థలాన్ని ఆర్ఎంకె ఆగ్రో సంస్థ కొనుగోలు చేసి ధరణి రికార్డుల్లో నమోదు చేసుకున్నారని మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి చెప్పారు. సర్వేనెంబర్ 28 లో ఇంటి నిర్మాణాలకు అనుమతులు తీసుకున్నట్లుగా మున్సిపల్ రికార్డుల్లో లేదు. 1986లో చేసిన పంచాయతీ అనాథరైజ్డ్ లేఅవుట్ అని ...ఆ లేఔట్ లో వదిలేసిన ఖాళీ, పార్క్ స్థలాలు మున్సిపాలిటీ గాని గ్రామపంచాయతీ గాని అప్పగించినట్లు రికార్డుల్లో లేదని చెప్పారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి హెచ్ఎండిఏ అధికారులకు లేఖ పంపిస్తామని చెప్పారు.

భయబ్రాంతులకు గురి చేస్తున్నారు: మేడ బోయిన జంగయ్య , బాధితుడు

సర్వేనెంబర్ 27, 28 లో వెంచర్లు ప్లాట్ నెంబర్ 171 కొనుగోలు చేసి ప్లాటు చూడడానికి వెళ్తే నా ఫ్లాట్ ను కబ్జా చేసుకుని జైన్ సంస్థ భారీ నిర్మాణం చేపడుతోంది. ప్లాట్ కబ్జా గురైందని ప్రశ్నిస్తే.. భయభ్రాంతులకు గురి చేయడంతో పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని బాధితుడు జంగయ్య చెప్పారు. తనకి ఇక్కడ న్యాయం జరగకపోతే...జైన్ సంస్థ పై , ఆర్ ఎన్ కె ఆగ్రో సంస్థపై రాష్ట్ర ప్రభుత్వానికి, హైడ్రాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు : లలిత్ జైన్

అన్ని విధాల డాక్యుమెంట్లు సరిగా చూసుకునే భూమి కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడుతున్నాం. అనాథరైజ్డ్ లే అవుట్లలోని ప్లాట్లను ఇటీవల కొనుగోలు చేసి కావాలని కొందరు రాద్ధాంతం చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని జైన్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధి లలిత్ జైన్ చెప్పారు.

Next Story

Most Viewed