జిల్లాలో దంచి కొట్టిన వాన…పొంగి పొర్లిన వాలాద్రి వాగు

by Kalyani |
జిల్లాలో దంచి కొట్టిన వాన…పొంగి పొర్లిన వాలాద్రి వాగు
X

దిశ, ఝరాసంగం: సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం వాన దంచి కొట్టింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అత్యధికంగా జిన్నారం లో 4.6, ఝరాసంగం 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 4:00 గంటలకు సైతం భారీ వర్షం కురిసింది. ఝరాసంగం మండల కేంద్రంలోని వాలాద్రి వాగు పొంగిపొర్లిపోయింది. బిడకన్య గ్రామంలో వాగు రావడంతో గ్రామస్తులు అలర్ట్ గా ఉన్నారు. బర్దిపూర్ గ్రామంలోని కమ్మరి దత్తు అనే రైతు పొలంలో సోయా పంట పాడైపోయింది. ఇదే విషయంపై మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్ కు సమాచారం ఇవ్వగా సంబంధిత అధికారికి సమాచారం ఇచ్చి నష్టపరిహారం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర రైతులు ఎవరైనా పంట నష్టం జరిగినట్లయితే సమాచారం ఇవ్వాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కాగా జిల్లాలోని పటాన్ చేరు 3.8, కంకల్ 3.1, సదాశివపేట్ 2.9, గుమ్మడిదల, హత్నూర్ 2.6, సుల్తాన్ పూర్ 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా మిగతా ప్రాంతాల్లో మోస్తారుగా వర్షపాతం నమోదయింది.

Next Story

Most Viewed